పాల ఉత్పత్తిని పెంచేలా రైతులను ప్రోత్సహించాలి
పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ వీ లక్ష్మారెడ్డి
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 8: నిర్మల్ జిల్లాలో పశు పోషణకు కావాల్సిన వనరులు ఎంతగానో ఉన్నాయని, పశు గణాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ వీ లక్ష్మారెడ్డి పశు వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి పశుగణాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మల్ జిల్లాలో పశువులకు మేత, నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వడంతో వరిసాగు గణనీయంగా పెరిగిందని గుర్తు చేశారు. దీనికితోడు ఆహార పంటల మార్పిడి చేసినందున పశువులకు అవసరమయ్యే జొన్న, వరిగడ్డి ఇతర పశుగ్రాసంపై దృష్టి పెట్టాలని తెలిపారు. జిల్లాలో పశు పోషణకు అవసరమయ్యే పశుగ్రాసం విత్తనాలను అందిస్తామని పేర్కొన్నారు. పశువుల పెంపకానికి కృత్రిమ గర్బధారణ చేయడం జరుగుతున్నదని చెప్పారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు మేలు రకం పశువులను రైతులకు అందించాలని తెలిపారు.
ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ ద్వారా అమలవుతున్న రుణాల పథకాలను సద్వినియోగం చేసుకొని రైతులకు పాడి గేదెలను అందించాలన్నారు. నిర్మల్ జిల్లాలో రాబోయే ఏడాదిలోగా పదివేల లీటర్ల పాల సేకరణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విజయ డెయిరీ ద్వారా పశు పోషణ రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. అన్ని గ్రామాల్లో పశువులకు అవసరమయ్యే దవాఖానలో మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులు అంకిత భావంతో పనిచేసి వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పశుపోషణను ప్రోత్సహించాలన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పశు పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని విధాలా సహకారం అందిసామని పేర్కొన్నారు. గ్రామాల్లో నీటి తొట్టిలు, పశుగ్రాసం పెంపు కోసం గడ్డివిత్తనాలు అందించాలని సూచించారు. పశువుల చికిత్స కోసం పశువుల బోన్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి రమేశ్కుమార్, సహాయ సంచాలకులు, సిబ్బంది పాల్గొన్నారు.