ఇంటింటికీ వెళ్తున్న ప్రత్యేక వైద్య బృందాలు
బాధితులు భయాన్ని వీడేలా భరోసా
లక్షణాలున్నట్లు గుర్తించిన వెంటనే హోం ఐసొలేషన్
ఆ వెంటే మందుల కిట్ అందజేత
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు
సర్కారు సేవలపై ప్రజల సంతృప్తి
ఆదిలాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా ఆపత్కాలంలో సర్కారే అండగా నిలుస్తున్నది. వైరస్ కట్టడికి బహుముఖ యుద్ధం చేస్తూనే, ప్రజలకు కొండంత మనోధైర్యానిస్తున్నది. గురువారం నుంచే ఇంటింటా జ్వర సర్వేకు శ్రీకారం చుట్టి, ప్రతి ఒక్కరికీ ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నది. అందులో భాగంగా రంగంలోకి దిగిన బృందాలు, ఇంటింటికీ వెళ్లి భయాన్ని వీడేలా అవగాహన కల్పిస్తున్నాయి. ఇదే సమయంలో లక్షణాలున్నట్లు గుర్తించిన వారిని వెంటనే హోం ఐసొలేషన్ చేస్తూ, అక్కడికక్కడే మెడిసిన్ కిట్లు అందజేస్తున్నాయి. అందులో ఉండే మందులను ఎలా వాడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ భరోసానిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఇంటింటా జ్వర సర్వే స్పీడ్ అందుకున్నది. అన్ని జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో మరింత వేగంగా సాగుతున్నది. గురువారం 2268 బృందాలను రంగంలోకి దించిన అధికారులు, శుక్రవారం ఆ సంఖ్యను మరింత పెంచారు. ప్రతి ఇంటినీ సర్వే చేసే విధంగా ఎక్కడికక్కడ ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని ఆచరణలో పెడుతున్నారు. ఇదే సమయం లో సర్వే బృందం ఇండ్లకు వచ్చినప్పుడు ప్రజలు ముందుకొచ్చి తమకున్న జబ్బులను నిర్భయంగా చెప్పుకునే విధంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులతో అవగాహ న కల్పిస్తున్నారు. మరోవైపు సర్వే సిబ్బంది కూడా భరోసా ఇస్తున్నారు. కరోనా వచ్చిందని చెప్పుకోవడానికి ఇబ్బంది పడితే.. కుటుంబం మొత్తానికి ముప్పు పొంచి ఉం టుందని వివరిస్తున్నారు. ఇంటింటికీ ఆరోగ్య పరీక్షలు చేస్తూ, లక్షణాలు కనిపించిన వారికి మెడికల్ కిట్ అందిస్తున్నారు. ఆ మందులను ఎలా వాడాలి? ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? వివరిస్తున్నారు. బాధితుల్లో భయా న్ని పొగొట్టి భరోసాను నింపుతున్నారు.
బహుముఖ యుద్ధం..
కరోనా కట్టడికి రాష్ట్ర సర్కారు బహుముఖ యుద్ధం చేస్తున్నది. ఓవైపు ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసింది. మరోవైపు ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ కొవిడ్ చికిత్స కు అనుమతులు ఇస్తున్నది. ఇంకోవైపు వ్యాక్సి న్లు ఇస్తూనే, ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తున్నది. వీటితోపాటు సబ్సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఓపీకి అంతరా యం లేకుండా చూస్తున్నది. ఇదేసమయంలో క్షేత్రస్థాయిలోనే కరోనాను కట్టడి చేసేందుకు గురువారం నుంచి ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇంటింటా జ్వర సర్వేను చేపట్టి ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలను దూరం చేస్తున్నది. రంగంలోకి దిగిన బృందాల సభ్యులు జ్వరం లేదా కరో నా లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే వారికి మెడికల్ కిట్ ఇవ్వడంతోపాటు ఏ మందులు ఎలా వేసుకోవాలో చెబుతున్నారు. హోం ఐసొలేషన్లో అనుసరించాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. వీటితోపాటు సదరు బాధితులు అడిగే ప్రశ్నలకు సానుకూలంగా సమాధానాలు ఇస్తున్నారు. కరోనా విషయంలో భయమే మనిషిని చంపేస్తుందని అనేక రకాల సర్వేలు వెల్లడిస్తుండగా, బాధితులకు ధైర్యం నూరిపోస్తున్నారు. ఈ ఆత్మస్థయిర్యం సదరు బాధితుడికే కాదు, వారి కుటుంబ సభ్యుల్లోని ఆందోళలను దూరం చేస్తున్నది. ఇన్నాళ్లు జ్వరం, దగ్గు, జలుబు వచ్చినా ఎక్కడికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలో తెలియక ఇబ్బందులు పడిన ప్రజలకు ఇంటింటా సర్వే వారికి బాసటగా నిలుస్తున్నది.
కొండత ధైర్యం..
కరోనా నిర్ధారణ అయిన తర్వాత బాధితుడితోపాటు కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యేవారు. ఏ మందులు ఎలా వేసుకోవాలో తెలియక ఇబ్బంది పడేవారు. అంతేకాదు, ధైర్యం చెప్పే వారు లేక అధైర్యపడేవారు. కానీ, ఈ సమస్యలన్నింటికీ ఇంటింటా సర్వే పరిష్కారం చూపుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా బాధిత కుటంబాలకు బృందాలు ధైర్యం నూరిపోస్తున్నాయి. ‘మందులు ఇస్తు న్నాం వాడుకోండి. వారం రోజులు మేమే రోజూ వచ్చి చూసి వెళ్తాం. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే.. ఎప్పుడైనా సరే ఈ నంబర్లుకు ఫోన్ చేయండి’ అంటూ నంబర్లు ఇస్తున్నారు. దీంతో బాధితులకు భయం ముం దుగా దూరమవుతున్నది. ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యం అందేందుకు అవకాశం ఉందన్న నమ్మకంతో ఉంటున్నారు. మొత్తం మీద ఇంటికే వచ్చి మందులు ఇస్తుండడంతో సంతోషం వ్యక్తంచేస్తున్నారు.