ఆదిలాబాద్ రిమ్స్లో ముందస్తుగా పిల్లల వార్డు ఏర్పాటు
అందుబాటులోకి పది ఐసీయూ, 75 ఆక్సిజన్ బెడ్స్
వైద్య నిపుణులు, సిబ్బంది నియామకం
ఆదిలాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ థర్డ్ వేవ్ భయపెడుతున్నది. పిల్లలపై ప్రభావం చూపెడుతుందనే ప్రచారం నేపథ్యంలో సర్కారు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. మెరుగైన వైద్యం అందించి పిల్లల ప్రాణాలు కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే ఆదిలాబాద్ రిమ్స్లోని పిల్లల వార్డుతోపాటు మరో చిల్డ్రన్స్ వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. 75 బెడ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి బెడ్కు ఆక్సిజన్ సౌకర్యం కల్పించింది. వీటితోపాటు పది ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేసి.. వైద్య నిపుణులు, సిబ్బంది సేవలు అందించేలా చూస్తున్నది. చిన్నారులు ఆహ్లాదకర వాతావరణంలో ఉండడానికి బొమ్మలు వేయించింది.
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా నివారణ కోసం ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఏడాదిన్నర కాలంలో రెండు దశల్లో కొవిడ్-19 ప్రభావం చూపగా, మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. ఇందులో భాగంగా రిమ్స్లో 300 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసి, వైద్యులు, సిబ్బందితో 24 గంటల పాటు సేవలు అందించింది. సర్కారు తీసుకుంటున్న చర్యల ఫలితంగా బాధితులు త్వరగా కోలుకున్నారు. అలాగే జిల్లాలో కొద్ది రోజులుగా కేసులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. రోజుకు 2 నుంచి 5 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధించడం, ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూడడం, ఇతర జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా దవాఖానల్లో అర్హులందరికీ మొదటి, రెండో డోస్ టీకాలు వేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్లో చిన్నారులపై ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో వైద్య శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
రిమ్స్ పిల్లల వార్డులో 75 పడకలు..
జిల్లాలో ఉట్నూర్, బోథ్ కమ్యూనిటీ దవాఖానలతో పాటు 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 22 పీహెచ్సీలు ఉన్నాయి. వీటిల్లో చిన్నారులకు పలు రకాల వైద్య సేవలు అందిస్తున్నారు. పిల్లలకు అవసరమైన వైద్య సేవల కోసం ఆదిలాబాద్ రిమ్స్కు రెఫర్ చేస్తారు. జిల్లా కేంద్రంలోని రిమ్స్లోని పల్లల వార్డులో వైద్యులు అన్ని రకాల సేవలు అందిస్తారు. కరోనా థర్డ్వేవ్ ప్రచారం నేపథ్యంలో రిమ్స్లో పిల్లలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అదనంగా రెండు గదుల్లో 75 పడకలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 24 గంటలపాటు చిన్న పిల్లలకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ వార్డుల్లో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టంను అందుబాటులోకి తీసుకువచ్చారు. రకరకాల బొమ్మలను గీసి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించారు. పిల్లలకు శ్వాస సంబంధిత సమస్యలు వస్తే ఆక్సిజన్ అందించేందుకు పైపులైన్ను ఏర్పాటు చేసి, ప్రతి బెడ్ వద్ద రెగ్యులేటర్ను అమర్చారు. వీటితో పాటు కరోనా సోకిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు పది వెంటిలేటర్లతో ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేశారు.