మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
కలెక్టరేట్లో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ సమావేశం
హాజీపూర్, ఆగస్టు 5 : జిల్లాలో పెండింగ్లో ఉన్న అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నివారణపై జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా దళిత అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ రెడ్డి, మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డితో కలిసి పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, విద్యుత్, ఇతర శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి కృషి చేసి బాధితులకు న్యాయంతో పాటు నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం మండల, గ్రామ స్థాయిలో సమావేశాలను ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కేసుల పరిష్కారంలో భాగంగా చేసే డీఎన్ఎ నివేదిక ఆలస్యం కాకుండా దృష్టి సారించాలన్నారు. ఎఫ్ఆర్ఐ నమోదులో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే కలెక్టర్కు తెలియజేయాలని సూచించారు. ప్రతినెల నిర్వహించే సివిల్ రైట్స్ డే సమావేశానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. సమావేశంలో మంచిర్యాల ఏసీపీ అఖిల మహాజన్, జైపూర్ ఏసీపీ నరేందర్, మంచిర్యాల ఆర్డీవో వేణు, బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈవో దుర్గా ప్రసాద్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఖాజా నజీం అలీ అప్సర్, కార్యనిర్వాహక సభ్యులు అత్తి సరోజ, కమిటీ సభ్యులు జిల్లపెల్లి వెంకటేశ్, రేగుంట లింగయ్య, బచ్చల అంజయ్య సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.