ఏప్రిల్ నుంచి జూలై వరకు ప్రకటించిన సంస్థ
బొగ్గు, విద్యుత్ ఉత్పత్తిలో అధిక వృద్ధి
కరోనా సమయంలోనూ ఆగని ఉత్పత్తి
లాభాల్లో దూసుకుపోతున్న ఎస్టీపీపీ
కార్మికులు, అధికారులకు సీఎండీ అభినందనలు
శ్రీరాంపూర్, ఆగస్టు 4 : సింగరేణి కాలరీస్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో బొగ్గు, విద్యుత్ అమ్మకాల ద్వారా రూ.8,180 కోట్ల టర్నోవర్ సాధించి రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే కాలనికి రూ.4,748 కోట్లు సాధించగా, దానికంటే 72 శాతం అధికం. రికార్డు స్థాయిలో రూ.800 కోట్ల లాభాలు ఆర్జించింది. గతేడాది రూ.303 కోట్లు నస్టాలను చవిచూసిన కంపెనీ.., ఈ ఏడాది సాధించిన అద్భుతమైన టర్నోవర్ రీత్యా 364 శాతం వృద్ధితో లాభాలను గడించింది. ఇందులో బొగ్గు అమ్మకాల ద్వారా రూ.6,949 కోట్ల టర్నోవర్ సాధించగా, గతేడాది రూ.3,816 కోట్లు సాధించింది. మొత్తంగా 82 శాతం వృద్ధిని నమోదు చేసింది. మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కూడా మంచి టర్నోవర్, లాభాలతో ముందుకు సాగుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో రూ.1,231 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరిపి గతేడాది జరిపి, గతేడాది రూ.932 కోట్ల అమ్మకాలపై 32 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది.
కార్మికులు, అధికారులకు సీఎండీ అభినందనలు..
దీనిపై సింగరేణి సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్ హర్షం వ్యక్తం చేస్తూ.. కార్మికులు, అధికారులను అభినందించారు. గతేడాది నుంచి సంస్థ తీసుకున్న కరోనా నివారణ చర్యలు సత్ఫలితాలిచ్చిన నేపథ్యంలో ఆత్మ విశ్వాసంతో ఉత్సాహంగా విధు లు నిర్వహిస్తున్నారన్నారు. ఫలితంగా మొదటి 4 నెలల్లో ఉత్పతి సాధించామని పేర్కొన్నారు. మిగిలిన 8 నెలల కాలంలో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు. సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తన మార్కెట్ వ్యూహాలను మార్చుకున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ వస్తున్నదని తెలిపారు. ఆ దిశగా ఈ ఏడాది 700 లక్షల టన్నుల వరకు బొగ్గు సరఫరాకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు.