జైనథ్, ఆగస్టు 4 : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జైనథ్ మండలం భోరజ్ చెక్పోస్టు సమీపంలోని జాతీయ రహదారి 44కు ఇరువైపులా చేపడుతున్న ఎవెన్యూ ప్లాంటేషన్ పనులను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో జాతీయ రహదారి 85 కిలో మీటర్ల మేర విస్తరించి ఉన్నదన్నారు. ఈ రహదారికి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం 47,750 మొక్కలు గ్రామీణ ప్రాంతంలో, ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో 9 కి.మీ మేర 10,500 మొక్కలు నాటాలని ఆదేశించారు. జిల్లాలోని ఆరు మండలాల్లో 38 గ్రామపంచాయతీల పరిధిలో మొక్కలు నాటాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17,629 గుంతలను 1,391 మంది ఉపాధిహామీ కూలీలతో తవ్వించినట్లు తెలిపారు. మిగిలిన వాటిని రోజుకు 5 వేల చొప్పున తవ్వించాల్సి ఉందన్నారు. జిల్లాను హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. జిల్లా అటవీశాఖ అధికారి రాజశేఖర్, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, ఏపీడీ రవీందర్, ఎంపీడీవో గజానన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.