మంత్రిగా ఉన్న హయాంలో రహదారుల ఏర్పాటుకు కృషి
గిరి గ్రామాల్లో అనేక సంక్షేమ పథకాలు
ఎమ్మెల్యే జోగు రామన్న
సిరికొండలో అభివృద్ధి పనుల ప్రారంభం
ఆదిలాబాద్ రూరల్, మే 31 : నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని సిరికొండ గ్రామంలో సోమవారం అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి, పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామన్నారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు రహదారుల ఏర్పాటుకు కృషిచేశానని పేర్కొన్నారు. ఖండాల నుంచి ఆదిలాబాద్కు, ఖానాపూర్ నుంచి ఆదిలాబాద్కు బీటీ రోడ్లు నిర్మించి, గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించామన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీలు, రోడ్లతో పాటు అనేక రకాల సంక్షేమ పథకాలను వారికి అందిస్తున్నామని వెల్లడించారు. ఇంటింటికీ సురక్షితమైన నీరు అందించేందుకు మిషన్ భగీరథ ద్వారా కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, నాయకులు సెవ్వ జగదీశ్, జడ్పీటీసీ అభ్యర్థి ఆరె నరేశ్, ఉప సర్పంచ్ భూమన్న, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.