నిర్ధారణ పరీక్షల సంఖ్యనూ పెంచాలి
ఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజ్
శాంతినగర్ పీహెచ్సీ తనిఖీ
ఎదులాపురం,ఏప్రిల్30: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని, నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయాలని, కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యనూ పెంచాలని ఆదిలాబాద్ ఇన్చార్జి కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అర్హులందరికీ వ్యాక్సిన్ అందేలా అవగాహన కల్పిస్తూ వేగవంతం చేయాలన్నారు. కొవిడ్ పరీక్షలను కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించాలన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ను ఆదేశించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సరిహద్దు గ్రామాల్లోని అర్హులకు టీకా అందేలా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కలెక్టర్ వెంట అడిషనల్ డీఎంహెచ్వో, డీఐవో శ్రీకాంత్, డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్ అతుల్, మెడికల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, వైద్యసిబ్బంది ఉన్నారు.
మూడో విడుతకు పకడ్బందీ ఏర్పాట్లు
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 30 : జిల్లాలో మూడో విడుత వ్యాక్సినేషన్కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. 18-44 ఏళ్ల లోపు వారందరికీ టీకాను వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే 45 ఏళ్లు నిండిన వారందరీకి మొదటి, రెండో విడుతలో వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. ఆన్లైన్లో రిజిస్ట్ట్రేషన్ చేసుకున్న వారు స్లాట్ బుకింగ్ ద్వారా ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో మాత్రమే టీకా వేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాలకు వస్తే టీకా ఇవ్వబోమని స్పష్టం చేశారు. జిల్లాలో అన్ని పీహెచ్సీలతో పాటు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలల్లో టీకా ఉచితంగా అందించనున్నట్లు వివరించారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కర్ఫ్యూకు సహకరించాలి..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో రాత్రి కర్ఫ్యూను మరో వారం పాటు పొడిగించినట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. ఈ నెల 1 నుంచి 8 వరకు జిల్లాలో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావద్దని సూచించారు.