ఇచ్చోడ, ఆగస్టు 3 :సోయాబీన్ సాగులో సస్య రక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులు సాధించే అవకాశాలున్నాయని జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఏరువాక శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ అన్నారు. మండలంలోని నవేగావ్ గ్రామంలోని రైతు చోలే తులసీరావ్ వ్యవసాయ క్షేత్రంలో నత్తల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. పొలం గట్లపై గడ్డి, తేమ లేకుండా ఉంచాలన్నారు. మొక్కలపై ఫెనిత్రోతేయాన్ మందును 1.5 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. నత్తల నివారణకు మోటాలీహైడ్ గుళికలు చల్లుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రమేశ్, ఏడీఏ రాంకిషన్, ఏఈవో సాయిరావ్, రైతులు పాల్గొన్నారు.
గులాబీ పురుగు నివారణపై అవగాహన
తాంసి, ఆగస్టు 3: పత్తిపంటలో గులాబీ రంగు పురుగు నివారణకు రైతులు చర్యలు తీసుకోవాలని ఏఈవో యోగిరాజ్ సూచించారు. మండలంలోని పొన్నారి, హస్నాపూర్లో పత్తిపంటలో గులాబీ రంగు పురుగు నివారణపై మంగళవారం అవగాహన కల్పించారు. ఈ పురుగు ఉధృతిని గుర్తించేందుకు రైతులు ఎకరాకు 6 నుంచి 8 లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే వేపనునే 1500ఈసీ లీటరును 200 లీటర్లనీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంజీవ్రెడ్డి, నర్సింగ్, ఎంపీటీసీ రఘు, ఉప సర్పంచ్అశోక్, రైతులు పాల్గొన్నారు.
లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలి
భీంపూర్, ఆగస్టు 3: పత్తి పంటలో ప్రస్తుత దశలో గులాబీ పురుగు నివారణకు ఎకరానికి 6 నుంచి 8 వరకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ఏఈవో శంకర్ సూచించారు. భీంపూర్ రైతువేదిక భవనంలో మంగళవారం రైతులకు అవగాహన కల్పించారు. పత్తి, కంది,సోయా పంటల సాగులో రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మోతాదుకు మించకుండా పురుగు మందులు వాడాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మడావి లింబాజీ, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు ఉత్తంరాథోడ్ , రైతులు ఉన్నారు. కరంజి(టీ), అర్లి(టీ), ధనోరా క్లస్టర్లలో ఏఈవోలు వికాల్, సతీశ్, మహేశ్ రైతులకు అవగాహన కల్పించారు.