బోథ్, ఏప్రిల్ 16: మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని అదనపు కలెక్టర్ డేవిడ్ సూచించారు. శుక్రవారం మండలంలోని ఘన్పూర్, నిగిని సరిహద్దు చెక్పోస్టులను జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి నరేందర్ రాథోడ్, ఆర్డీవో రాజేశ్వర్, ఎంపీపీ తుల శ్రీనివాస్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రాకపోకలు కొనసాగించే వారి వివరాలు నమోదు చేసి పరీక్షలు చేయాలన్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్యారోగ్యశాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. థర్మల్ స్క్రీనింగ్లో టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లు తేలితే వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్తో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. 45 ఏండ్లు నిండినవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సీహెచ్ రాధ, సూపర్వైజర్ నర్సింహస్వామి, సర్పంచులు శకుంతల, సకారాం, గులాబ్సింగ్, జాదవ్ రోహిదాస్, జీపీ కార్యదర్శి ఎండీ తహమీదుల్లా, సాయన్న, సిబ్బంది ఉన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ బతికించుకోవాలి
ఇచ్చోడ, ఏప్రిల్ 16: తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని అదనపు కలెక్టర్ డేవిడ్ సూచించారు. వాటరింగ్ డేను పురస్కరించుకొని శుక్రవారం స్థానిక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని మొక్కలకు ట్యాంకర్ నీళ్లు పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చనిపోయిన మొక్క స్థానంలో వెంటనే మరో మొక్కను నాటాలని ఆదేశించారు. మొక్కలను పెంచడంలో నిర్లక్ష్యం చేయరాదని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చౌహాన్ సునీత, ఉప సర్పంచ్ లోక శిరీష్రెడ్డి, ఎంపీడీవో వామనభట్ల రాంప్రసాద్, ఎంపీవో రమేశ్, ఈవో నర్సారెడ్డి, పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.