వరుసగా రెండో ఏడాది పంట..
ఆయకట్టు 10 వేల ఎకరాల్లో వరి..
కాళేశ్వరం ప్రాజెక్టు, కాకతీయ కాలువ ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా సరిపడా నీరు
తెలంగాణ సర్కారు కృషి.. ఆనందంలో రైతులు
ఖానాపూర్ టౌన్, ఏప్రిల్ 29 : ఖానాపూర్, కడెం మండలాల జీవనాధారమైన సదర్మాట్ ఆయకట్టు కింద యాసంగి పంట కూడా పండుతున్నది. తెలంగాణ సర్కారు పుణ్యమా అని.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభావం, కాకతీయ కాలువ ఎస్కేప్ రెగ్యులేటర్తో సరిపడా నీరు అందుతున్నది. దీంతో వరుసగా రెండో యేటా సాగు సంబురంగా సాగుతున్నది. గత పాలకుల పట్టింపులేనితనం.., నిర్లక్ష్యంతో.. నేల నెర్రెలువాసింది. నాయకులు, అధికారుల చుట్టూ తిరిగినా రైతులకు ఫలితంలేకుండా పోయింది. కానీ, అన్నదాతలకు ఇప్పుడు ఆ దుస్థితి లేకుండా పోయింది. ఆయకట్టు కింద ఈ ఏడాది 10 వేల ఎకరాల్లో వరిపండుతున్నది.
కాకతీయ కాలువ ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా..
సదర్మాట్ ప్రధాన కాలువకు కాకతీయ కాలువ ఎస్కేప్ రెగ్యులేటర్ ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టు రైతుల అవసరాల కోసం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి పారుదల శాఖ అధికారులు సదర్మాట్ నుంచి ఆయకట్టు ప్రధాన కాలువకు నిత్యం 450 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం వరి పంట కోత దశకు చేరింది. ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ సర్కారు వల్లే సాధ్యమైందని రైతులు అంటున్నారు. గతంలో తమ గోడు పట్టించుకున్న నాథుడేలేడని, నాయకులు, అధికారులు చుట్టూ తిరగాల్సి వచ్చేదని ఆవేదన వెలిబుచ్చారు. అలాంటిది తెలంగాణ సర్కారు హయాంలో నేడు సదర్మాట్ కింద రెండో సారి యాసంగి పంట పండించుకుంటున్నామంటే ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. ఇక భవిష్యత్లో కూడా తమకు యాసంగి పంటకు ఢోకా ఉండదని పేర్కొంటున్నారు.
సాగునీటికి ఇబ్బంది లేదు..
కాలువ కింద యాసంగిలో వరి పంటలు పండిస్తున్న రైతులకు నీటి సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. సదర్మాట్ ఆయకట్టు కింద వరిసాగు చేస్తున్న రైతులకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నాం. ఈ ఏడాది నుంచి యేటా రెండు పంటలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఎమ్మెల్యే రేఖానాయక్ సహకారంతో పంటి చేతికందే వరకు కావాల్సిన నీరు అందిస్తాం.
సదర్మాట్పై నమ్మకం పెరిగింది..
ఆంధ్రా నాయకుల పాలనలో వానకాలంలో కూడా రైతులకు సదర్మాట్ సాగునీరు ఇవ్వలేని సందర్భాలున్నాయి. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీరు, రైతుల శ్రేయస్సుపై పూర్తి దృష్టిపెట్టింది. రెండు పంటలకు సరిపడా నీరు ఇస్తే రైతులు బాగుపడుతారన్న సీఎం కేసీఆర్ ఆలోచనలు కార్యరూపం దాల్చుతున్నాయి. ఇక రాబోయే రాజుల్లో యటా రెండు పంటలు పండుతాయని నమ్మకం కలుగుతున్నది.