ఎదులాపురం, ఆగస్టు 3 : బాధ్యతలు మరింత ఉత్తమంగా నిర్వహించడానికి 12 వర్టికల్ అంశాలు తోడ్పాడుతాయని, ఈ విధానంలో ఇన్చార్జి అధికారులను నియమించినట్లు ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. స్థానిక హెడ్క్వార్టర్లోని పోలీస్ సమావేశ మందిరంలో వర్టికల్ ఇన్చార్జి అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, ఆర్ధిక నేరాలను కట్టడి చేస్తూ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు కొనసాగించాలని సూచించారు. ప్రతిరోజూ 12 వర్టికల్ అంశాల్లో నిర్వహించిన విధులను పర్యవేక్షించే అధికారం సీఐ, డీఎస్పీలకు కల్పించినట్లు తెలిపారు. ఆదిలాబాద్ గ్రామీణ సీఐ కే పురుషోత్తమాచారికి రిసెప్షన్, జైనథ్ సీఐ కోంక మల్లేశ్కు స్టేషన్ , నేరదర్యాప్తు రైటర్లు, ఎస్ఐ వీ గంగాసాగర్కు కంప్యూటర్, టెక్నికల్ టీం, కమ్యూనికేషన్, న్యాయస్థానం విధులు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ టూ టౌన్ సీఐ పోతారం శ్రీనివాస్, సీఐ కంప రవీందర్కు ఇచ్చోడలో వారెంట్లు, సమన్లు, ఉట్నూర్ డీఎస్పీ ఎన్ ఉదయ్రెడ్డికి పోలీస్స్టేషన్ ఇన్చార్జి అధికారి (ఎస్హెచ్వో)గా, బేల ఎస్ఐ ఈ.సాయన్నకు పెట్రోలింగ్ వాహనాలు ,బ్లూకోట్స్, షీటీం, బజార్హత్నూర్ ఎస్ఐ పీ ఉదయ్ కుమార్కు (మెడికల్, పీఎంఈ, ఎఫ్ఎస్ఎల్, తది తర సర్టిఫికెట్లు, సీసీఎస్ సీఐ ఈ.చంద్రమౌళికి నేరాలను నిరోధించడం, పోలీస్ స్టేషన్లో రోజువారీ విధులు అప్పగించినట్లు తెలిపారు.
ఉట్నూర్ సీఐ వీ నరేశ్ కుమార్కు 5ఎస్ విధానం, కమ్యూనిటీ పోలీసింగ్, ట్రాఫిక్ సీఐ ఏ రాంనరసింహారెడ్డికి ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పర్యవేక్షణలో విధులు కొనసాగుతాయని చెప్పారు. పోలీస్ స్టేషన్లు, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచి నాణ్యమైన సేవలు అందించే వాతావరణం కల్పించేందుకు 5-ఎస్ వర్టికల్ విధానంతో పాటు ఇతర 11 విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోటీపడి మెరుగైన ర్యాంకు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ.. వర్టికల్ విధానంతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో పోలీసులకు మరింత శ్రమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అతి ముఖ్యమైన 12 పోలీస్ వర్టికల్ విధులపై, పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. కేసు నమోదైన వెంటనే దర్యాప్తు అధికారి చేపట్టాల్సిన బాధ్యతలను వేగంగా నిర్వహించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తూ జవాబుదారీగా పనిచేస్తున్నప్పుడే బాధితులకు న్యాయం చేకూరుతుందన్నారు. ఇటీవల ఎంపికైన నూతన కానిస్టేబుళ్లందరూ ఉన్నత విద్యాభ్యాసం పొందినవారే ఉండడతో పోలీసు స్టేషన్లోని చిన్నచిన్న బాధ్యతలు వారికి అప్పగించాలని సూచించారు.
రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పోలీస్శాఖలో వినూత్న మార్పులు రావడంతో ప్రస్తుతం కానిస్టేబుల్ అధికారిగా పిలువబడుతున్నారని తెలిపారు. వారికి బాధ్యతలు ఇస్తే వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్.శ్రీనివాసరావు, ఏఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ్, వర్టికల్ ఇన్చార్జి సీఐలు, పోలీస్ ఆసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణణ, తదితరులు పాల్గొన్నారు.