వచ్చే హరితహారానికి మొక్కలు సిద్ధం చేస్తున్న మున్సిపల్ శాఖ
మున్సిపల్ పరిధిలో 10 నర్సరీల ఏర్పాటు
10 లక్షల మొక్కల పెంపకమే లక్ష్యం
ఆదిలాబాద్ రూరల్, మార్చి 29: రానున్న వానకాలంలో చేపట్టనున్న హరితహారానికి మున్సిపల్ పాలకవర్గం, అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటి వరకు చేపట్టిన ఆరు విడుతల హరితహారం కార్యక్రమాలకు అవసరమైన మొక్కలను అటవీ శాఖ, ఉపాధి హామీ నర్సరీల నుంచి తీసుకొచ్చారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోనే ప్రస్తుతం నర్సరీలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పట్టణంలో పది చోట్ల నర్సరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
నర్సరీల ఏర్పాటు ఇలా..
పట్టణంలోని టీటీడీసీ, హార్టికల్చర్, గాంధీపార్క్, బంగారుగూడ, ఖుర్షీద్నగర్, జీఎస్ ఎస్టేట్, అనుకుంట, దుర్గానగర్లో నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇందులో వచ్చే ఏడాది హరితహారానికి కావాల్సిన వివిధ జాతుల మొక్కలను 10 లక్షలు పెంచాలని నిర్ణయించారు. ఒక్కో నర్సరీకి ఉన్న స్థలాన్ని బట్టి 80 వేల నుంచి లక్ష మొక్కల పెంపకం చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పలు నర్సరీల్లో మొక్కలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ముఖ్యంగా పట్టణంలోని ప్రజలకు అవసరమైన పండ్లు, పూల మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఇవి కూడా చదవండి
పండంటి బిడ్డ కోసం.. పక్కా ప్రణాళిక