ఆదిలాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులపై ఆధారపడిన వారి పరిస్థితి దయనీయంగా ఉండేది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లోని ప్రజలు ఉపాధి కోసం పట్టణాలకు వలస పోయేవారు. భవనాల నిర్మాణాలు, పరిశ్రమల్లో కూలీలుగా పనిచేసేవారు. పట్టణాల్లో చాలీచాలని వేతనాలతో జిల్లావాసులు బతుకుదెరువును ఈడ్చుకురావాల్సిన పరిస్థితి ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కులవృత్తులకు చేయూతనందించి వారి ఉపాధిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా సబ్సిడీపై గొర్రెలు, ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. నీలి విప్లవంలో భాగంగా ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. సమైక్య రాష్ట్రంలో మత్స్య సహకార సంఘాలకు 50 శాతం రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేసేవారు. కేవలం రూ.25వేల యూనిట్ను 50శాతం రాయితీతో రూ.12,500కు ఇచ్చేవారు. మత్స్యకారులకు మెరుగైన ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై రాహ, కట్ల, మృగాల చేప పిల్లలను పంపిణీ చేస్తున్నది. మేలు రకమైన చేపపిల్లలను ప్రభుత్వం పంపిణీ చేయడంతో మత్స్యకారుల ఉపాధి మెరుగుపడింది. సర్కారు అందిస్తున్న సాయం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో వానకాలం సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి వర్షాలు బాగు పడుతున్నాయి. దీంతో జిల్లాని సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులతో పాటు చెరువులు నిండుకుండలా మారాయి. సాగునీటి వనరుల్లో పుష్కలంగా నీరు చేరడంతో ఈ ఏడాది చేపల పెంపకం ద్వారా మత్స్యకారుల ఉపాధిని మరింత మె రుగుపర్చేందుకు అధికారులు పకడ్బందీ ప్రణాళికలు తయారు చేశారు. జిల్లాలో గతేడాది వానాకాలంలో రెండు ప్రాజెక్టులు, 227 చెరువుల్లో 1.19 కోట్ల చేపపిల్లల పెంపకాన్ని చేపట్టగా ఈ ఏడాది వానకాలంలో రెండు ప్రాజెక్టులతో పాటు 265 చెరువుల్లో 1.32 కోట్ల చేప పిల్లలను వదలనున్నారు. జిల్లా వ్యాప్తంగా సెప్టెంబరు నెలలో కూడా వానలు పడుతుండడంతో ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు ఏ మాత్రం తగ్గలేదు. జిల్లాలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ ప్రక్రియను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సోమవారం ప్రారంభించారు. జైనథ్ మండలంలో మాంగుర్ల వద్ద సాత్నాల ప్రాజెక్టులో ఆయన చేప పిల్లలను వదిలారు. చెరువుల్లో నీటి లభ్యత, చేప పిల్లల పెరుగుదలకు అనుగుణంగా కట్ల, రోహు, మృగాల వంటి చేప పిల్లల వదలుతున్నారు. చెరువుల్లో 25-40 ఎంఎం, ప్రాజెక్టుల్లో 80-100 ఎంఎం, చేప పిల్లలను వేస్తున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
జిల్లాలో రేపటి నుంచి అన్ని చెరువుల్లో చేపలను వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది కోటి 33 లక్షల చేప పిల్లలను వదలగా, ఈ ఏడాది కూడా కోటి 37లక్షల చేప పిల్లలను వదిలేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. బుధవారం నుంచి చెరువులు, ప్రాజెక్టుల్లో చేపలు వేసే కార్యక్రమం ప్రారంభం కా నుంది. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు కోవ లక్ష్మి, స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కుల చేతుల మీదుగా అడ ప్రాజెక్టులో చేప పిల్లలను వేయనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి సాంబశివ రావు తెలిపారు. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన కుమ్రం భీం జలాశయం, జగన్నాథ్పూర్ ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు, చెలిమెల వాగు ( ఎన్టీఆర్ సాగర్) ప్రాజెక్టులతోపాటు 10 పెద్ద చెరువులు, 267 చెరువులు, కుంటల్లో చేపలను వేయనున్నారు. జిల్లాలో కోటి 37 లక్షల చేప పిల్లలను ఉచితంగా వేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
మత్స్యకారులకు అండగా..
మత్స్యకారులకు రెండేళ్లలో సుమారు రూ. 25 కోట్లతో అనేక వసతులు కల్పించింది. గతేడాది జిల్లాలోని 251 నీటి వనరుల్లో వేసిన చేప పిల్ల ల ద్వారా దాదాపు 5 వేల టన్నుల దిగుబడి రావడంతో మత్స్యకారులకు ఆర్థిక ఆదాయం సమకూరింది. కాగా, ఈ సారి కోటి 37లక్షల చేప పిల్లల నుంచి దాదాపు 6 వేల టన్నుల ఉత్పత్తి సాధించాలనేది మత్స్యశాఖ లక్ష్యం. చేపల పెంపకం ద్వారా జిల్లాలోని సుమారు ఐదు వేల మత్స్యకారుల కుంటుంబాలు ఉపా ధి పొందుతున్నారు. 31 మత్స్య సహకార సం ఘాలు రిజిష్టర్ అయ్యాయి. వీటిలో 2051 మంది సభ్యులుగా ఉన్నారు. చేపల పెంపకం, విక్రయం ద్వారా వీరందరికీ ఉపాధి లభిస్తున్నది. ప్రభుత్వం మూడేళ్లుగా మత్స్యకారులకు పెద్ద ఎత్తున వాహనాలను అందించింది. 16 లగేజీ వాహనాలు, 5 సంచార వాహనాలతోపాటు సుమారు 300 మోపెడ్లు, వలలు, ఇతర సామగ్రిని అందించింది.
నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేస్తాం.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది ప్రాజెక్టులు, చెరువుల్లో 1.32 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు తయారు చేశారు. సోమవారం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాగా, నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన సాగునీటి వనరుల్లో పిల్లలను వేస్తాం. ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తుండగా ఈ ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నాం. ఈ ఏడాది ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో చేపలు బాగా పెరిగే అవకాశాలున్నాయి.
-విజయ్కుమార్. జిల్లా మత్య్యశాఖ అధికారి, ఆదిలాబాద్