మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 24 : మంచిర్యాలకు చెందిన సఖీ కేంద్రం సిబ్బంది ఆరు రోజుల పసికందు ప్రాణాలు కాపాడారు. వివరాలకు వెళ్తే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరోం చ తాలుకా బెజ్జూరుపల్లికి చెందిన సోని, మల్లేశ్ దంపతులకు పాప పుట్టింది. తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆరు రో జుల క్రితం మంచిర్యాలకు తీసుకువచ్చారు. ఇక్కడికి వచ్చాక పాపకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు పిట్స్ కూడా వచ్చాయి. దీంతో చేతిలో చిల్లిగవ్వ వారు దిక్కుతోచని స్థితిలో ఐబీ ఏరియాలో పాపతో ఉన్నారు. సఖీ సిబ్బంది వారిని గమనించి పాపను సర్కారు దవాఖానకు తరలించారు. చికిత్సతో పాటు ఆక్సిజన్ అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆరు రోజులుగా ఆ చిన్నారికి వైద్యమందించేందుకు జిల్లా సంక్షేమాధికారి ఉమాదేవి, సఖీ సెంటర్ సీఏ శ్రీలత, కలెక్టర్ భారతీ హోళికేరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సోని కూడా బలహీనంగా ఉండడంతో తనకు సైతం రక్తం ఎక్కించారు. ఈ సందర్భంగా సఖీ సిబ్బంది శైలజ, ప్రసన్న లక్ష్మీ, జిల్లా సంక్షేమాధికారి ప్రసన్న లక్ష్మిని పలువురు అభినందించారు.
స్పందించిన దాతలు..
చిన్నారిని కాపాడేందుకు చాలా మంది దాతలు సైతం ముందుకు వచ్చారు. ఆదివాసీ ఉద్యోగులు మడావి శంకర్, ప్రసన్నలక్ష్మి, క్రాంతికుమార్, బారీక్రావు, శేఖర్ రూ. 18, 200 అందచేయగా, ఇతరులు కూడా ఆర్థికసాయం చేశారు.