బోథ్, ఆగస్టు 1:బోథ్ మండలంలోని దేవులనాయక్తండా.. అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సంపత్నాయక్తండా, పూల్సింగ్తండాతో కలుపుకొని ఏర్పడిన ఈ జీపీ.. పల్లె ప్రగతితో రూపురేఖలు మార్చుకున్నది. ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో విజయవంతంగా పనులు పూర్తిచేసుకొని ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రగతిలో మిగతా గ్రామాలతో పోటీపడుతున్నది. కాగా, గ్రామస్తుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.బోథ్ మండలంలోని దేవులనాయక్తండా గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. జీపీ పరిధిలో సంపత్నాయక్తండా, పూల్సింగ్తండా గ్రామాలున్నాయి. వీటిలో సుమారు 155 కుటుంబాలుండగా, 770 మంది ఉన్నారు. ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో ఇంతకుముందు చింతల్బోరి జీపీ పరిధిలో ఉన్న ఈ మూడు గ్రామాలు కలుపుకొని కొత్త పంచాయతీగా ఏర్పాటైంది. పల్లె ప్రగతి, 15వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ తదితర పథకాల కింద పంచాయతీకి సుమారు రూ.50 లక్షలు వచ్చాయి.
వీటిలో రూ.12.50 లక్షలతో శ్మశానవాటిక, రూ.8 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.2.30 లక్షలతో డంప్యార్డు, రూ.3.85 లక్షలతో దేవులనాయక్తండాలోని గుట్ట చుట్టూ వరద నీటి మళ్లింపు కోసం సుమారు 100 మీటర్ల కాలువ, సంపత్నాయక్తండాలో రూ.4 లక్షలతో డ్రైనేజీ పనులు చేపట్టారు. పూల్సింగ్తండాలోనూ అభివృద్ధి పనులు చేపట్టారు. వీటికి తోడు మిషన్ భగీరథ కింద మంచినీటి ట్యాంకులు నిర్మించి ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని అందిస్తున్నారు. అనుబంధ గ్రామాలుగా ఉన్న సమయంలో మూడు తండాల్లో అభివృద్ధి కోసం ఏడాదికి కనీసం రూ.లక్ష నిధులు కూడా వచ్చేవి కావని గిరిజనులు తెలిపారు. తండాలను జీపీలుగా ఏర్పాటు చేయడంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతూ, మిగతా గ్రామాలతో పోటీ పడుతున్నామని పేర్కొంటున్నారు.
అభివృద్ధిలో పోటీ పడుతున్నాం..
మాది చిన్న పంచాయతీ. అయినా అభివృద్ధిలో మిగతా జీపీలతో పోటీ పడుతున్నాం. ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులతో పంచాయతీ కేంద్రంతో పాటు అనుబంధ గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయిస్తున్నాం. మూడేళ్లలోనే సుమారు రూ.50 లక్షలతో పనులు పూర్తిచేశాం. పల్లె ప్రకృతి వనాన్ని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేశాం.