నిర్మల్ అర్బన్, ఆగస్టు 1 : నిర్మల్ పట్టణ ప్రజలకు ఇక నిరంతరం మిషన్ భగీరథ తాగునీటిని అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన తాగునీటిని అందించేందుకు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నది. నాణ్యతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్ల నీటి కంటే పది రెట్లు స్వచ్ఛమైన తాగునీరు మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం కేసీఆర్తో రూ.40 కోట్ల నిధులను మంజూరు చేయించారు. పనులు ప్రారంభం కాగా.. వేగంగా పూర్తి చేయిస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఐదు ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా 42 వార్డుల ప్రజలకు నిరంతరం తాగునీటిని అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పట్టణంలో 10,400 నల్లా కనెక్షన్లు ఉండగా.. నూతన పైప్లైన్ పనులతో అదనంగా మరో 10,000 కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నారు. పట్టణంలో శరవేగంగా పనులు సాగుతున్న నేపథ్యంలో ఇక పట్టణ ప్రజలకు మిషన్ భగీరథ నీరు అందించనున్నారు.
నిర్మల్ పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడంతో పాటు శుధ్ధ జలం అందించేందుకు రూ.40 కోట్లతో మిషన్ భగీరథ పనులను చేపడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల్లో వేగంగా పనులు పూర్తయిన వాటిలో నిర్మల్ ముందంజలో ఉంది. 20 ఏండ్ల క్రితం పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రహించిన అప్పటి ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రూ.32 కోట్ల నిధులతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి పైప్లైన్ ద్వారా సిద్దాపూర్ ఫిల్టర్ బెడ్ వరకు తీసుకొచ్చి అక్కడి నుంచి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించారు. ఇప్పుడు రూ.40 కోట్లతో తాగునీటి పనులను పూర్తి చేయించారు. పట్టణంలో 42 వార్డుల ప్రజలకు తాగునీరు అందనుండగా.. ఇందుకోసం 97.17 కిలోమీటర్ల మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ పనులను చేపట్టారు.
శరవేగంగా ఐదు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం..
మిషన్ భగీరథ తాగునీటిని ప్రజలకు అందించేందుకు నిర్మల్ పట్టణంలో 39 లక్షల లీటర్ల సామర్థ్యంతో పట్టణంలో ఐదు ఓవర్ హెడ్ ట్యాంకుల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గాంధీపార్కులో 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో రూ.1.45 కోట్లతో నిర్మించిన ట్యాంకును ప్రారంభించారు. ఈ ట్యాంకు ద్వారా 11.20 కిలో మీటర్ల పరిధిలోని 10 వార్డులైన శరత్ మహల్, బాగులవాడ, మోతీనగర్, నటరాజ్నగర్, భాగ్యనగర్, ఇందిరానగర్, మదీనా కాలనీ, ప్రియదర్శినినగర్, జోహ్రనగర్, కళానగర్ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందనుంది. మిగతా నాలుగు ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మాణంలో ఉన్నాయి. 12 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఇసురాళ్ల గుట్ట వద్ద, 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో విశ్వనాథ్పేట్, 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో శాంతినగర్, ప్రియదర్శినినగర్ కాలనీల్లో నిర్మిస్తుండగా.. పనులు చివరి దశలో ఉన్నాయి.
మంత్రి చొరవతో తీరనున్న కన్నీటి కష్టాలు..
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక చొరవతో పట్టణ ప్రజలకు మిషన్ భగీర థ తాగునీరు అందనుంది. రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలో పూర్తి కాని పనులు నిర్మల్లో వేగంగా సాగుతున్నాయి. మిషన్ భగీరథలో ఏమైనా ఇబ్బందులు తలెత్తి తే పట్టణ ప్రజలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా తాగునీటిని అందించేందుకు సైతం ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం అక్కడక్కడా దెబ్బతిన్న పైప్లైన్లకు మరమ్మతులు చేసేందుకు నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చా రు. దీంతో పట్టణ ప్రజలకు ఇటు మిషన్ భగీరథ నీటితో పాటు ప్రత్యామ్నాయంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని అందించేందుకు సిద్ధ్దమవుతున్నారు. ప్రస్తుతం రూ.40 కోట్లతో చేపడుతున్న మిషన్ భగీరథ పనులతో రానున్న 30 ఏండ్ల వరకు ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తవు.
24 గంటలు నిరంతరం నీరందిస్తాం..
పట్టణ ప్రజలకు నిరంతరం తాగునీరు అందించేందుకు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సహకా రంతో పట్టణంలో మిషన్ భగీరథ నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాం. ఇందు కోసం మంత్రి సహకారంలో పట్టణంలో 39 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఐదు ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తాం. ఇందులో గాంధీ పార్కులోని ఓవర్ హెడ్ ట్యాంకును ఇటీవల ప్రారం భించుకున్నాం. మిగతా నాలుగు ట్యాంకుల పనులు చివరి దశలో ఉన్నాయి. వాటిని త్వరలోనే ప్రారంభిస్తాం. మిషన్ భగీరథ నీటితో పాటు ప్రత్యామ్నాయంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీరందిం చేందుకు సైతం సిద్ధంగా ఉన్నాం.