గుడిహత్నూర్, మార్చి 11 : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామ పంచాయతీ గతంలో నిధుల్లేక అనేక సమస్యలతో సతమతమైంది. ఈ పంచాయతీ పరిధిలో రాగాపూర్, తోషం తండా, టాకీగూడ, తోయగూడ ఉపగ్రామాలు ఉండేవి. కనీస నిధులు రాక అభివృద్ధికి నోచుకోక సమస్యలు తాండవం చేశాయి. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు 2018లో కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసింది. దీంతో రాగాపూర్, తోషం తండా ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పడ్డాయి. తోషం పంచాయతీలో 3045 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ ఏడాదిన్నరగా పల్లె ప్రగతి కింద వివిధ పనులు చేపట్టారు. దీంతో గ్రామం ప్రగతిబాట పట్టింది. ఇప్పటి వరకు రూ.45 లక్షల ఖర్చుతో ప్రగతి పనులు చేపట్టారు. దీంతో వీధివీధినా సీసీ రోడ్లు, మురుగు కాలువలు, ఆహ్లాదాన్ని పంచే పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. పంచాయతీలో ఒకే చోట ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంప్ యార్డు, నర్సరీ ఏర్పాటు చేయడంతో మండలంలోనే ఆదర్శంగా నిలిచింది. గ్రామానికి ఆనుకొని ఉన్న చెరువు పక్కనే విశాలమైన ఖాళీ ప్రదేశంలో రూ.12లక్షలతో శ్మశానవాటిక నిర్మించారు. దాని పక్కనే పల్లె ప్రకృతివనం ఏర్పాటు చేసి పట్టణంలోని పార్కులాగా ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే సందర్భంగా 350 రకరకాల పూల, నీడనిచ్చే మొక్కలు నాటారు. గ్రామంలో చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా రూ.2.50లక్షలతో డంప్ యార్డు నిర్మించారు. అది కూడా వీటి పక్కనే ఏర్పాటు చేశారు. నర్సరీలో 11వేల పూల మొక్కలు పెంచుతున్నారు. ఇంటింటా పూల, పండ్ల మొక్కలు పెంచుకోవడానికి ఉపయోగపడేలా దృష్టి సారించారు. గ్రామంలో ఇంటింటికీ తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. నిత్యం ఉదయాన్నే చెత్తను సేకరించి ట్రాక్టర్ ద్వారా డంప్ యార్డుకు తరలిస్తున్నారు. పల్లె ప్రగతి పనుల ద్వారా చేపట్టిన పనులతో గ్రామంలో మౌలిక వసతులు సమకూరగా, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.