ఆదిలాబాద్, సెప్టెంబర్ 28 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): పంచాయతీ రాజ్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ప్రజా ప్రతినిధులకు సముచిత స్థానం కల్పించాలని సంకల్పించిన ప్రభుత్వం మరోమారు వారి గౌరవ వేతనాన్ని పెంచింది. రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అరకొర వేతనాలతో గడిపారు. స్వరాష్ట్రంలో రెండు సార్లు వేతనాలు పెరగడం విశేషం. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు 30 శాతం వేతనాలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై స్థానిక ప్రజా ప్రతినిధుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పెంపు ఇలా..
జడ్పీటీసీల వేతనం ప్రస్తుతం రూ. 10 వేలు ఉండగా, రూ. 3 వేలు పెరిగి రూ.13 వేలకు చేరనుంది. ఎంపీపీల వేతనం రూ. 10 వేలు ఉం డగా రూ.3 వేలు పెరిగి, రూ.13 వేలకు చేరింది. ఎంపీటీసీల గౌరవ వేతనం రూ. 5 వేలు ఉండగా రూ.1500 పెరిగి రూ.6500 రానుంది. సర్పంచ్లకు రూ. 5 వేల వేతనం ఉండగా రూ.1500 పెరిగి రూ.6500 రానుంది. ప్రభుత్వం పెంచిన వేతనాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో 1509 మంది సర్పంచ్లకు ప్రయోజనం చేకూరనుంది. ఆదిలాబాద్లో 468, నిర్మల్లో 396, మంచిర్యాల 310, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 335 మంది ఉన్నారు. మొత్తం 569 మంది ఎంపీటీసీలు ఉండగా, ఆదిలాబాద్, నిర్మల్లో 158 మంది చొప్పున, మంచిర్యాలలో 130, కుమ్రం భీంలో 123 మంది ఉన్నారు. ఇక ఎంపీపీలు నిర్మల్లో 18, ఆదిలాబాద్లో 17, మంచిర్యాలలో 16, ఆసిఫాబాద్లో 15 మంది ఉన్నారు. ఇక జడ్పీటీసీలు ఆదిలాబాద్ 17, నిర్మల్ 18, మంచిర్యాల 16, కుమ్రం భీం 14 మంది ఉన్నారు. వేతనాల పెంపుపై వీరంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు : మంత్రి సురేఖ, ఎంపీపీ, కోటపల్లి
పంచాయతీ రాజ్, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల వేతనాలను మరోసారి పెంచిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావ్కు ధన్యవాదాలు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు అరకొర వేతనాలతో కాలం నెట్టుకువచ్చిన ప్రజా ప్రతినిధులకు ప్రభు త్వం వేతనాలు అందించడం శుభపరిణామం. రాష్ట్ర ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధుల సమస్యలను అర్థం చేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ప్రజలు, ప్రజా ప్రతినిధులు రుణపడి ఉంటారు.