తెలంగాణ సర్కారు ప్రత్యేక దృష్టి
గత పాలకుల నిర్లక్ష్యంతోనే అభివృద్ధికి దూరం
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
హత్తిగూడ వద్ద రోడ్డు పనుల ప్రారంభం
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 16 : గిరిజనుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు ఎంతగానో కృషిచేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని హత్తిగూడ వద్ద దుబ్బగూడ నుంచి పోతంలొద్ది వరకు రూ.8కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే నేడు నియోజకవర్గంలోని అనేక గిరిజన గూడేలకు కనీస రోడ్డు సౌకర్యంలేక ఇబ్బందులుపడుతున్నారన్నారు. కానీ తెలంగాణ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులపై ప్రత్యేక దృష్టిపెట్టి, అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించిందని పేర్కొన్నారు. మారుమూల గ్రామాలకు సైతం రహదారుల సౌకర్యం కల్పించి, వారి ఇబ్బందులను తీర్చిందన్నారు. పోడు భూములకు వ్యవసాయ పట్టాలిచ్చామని తెలిపారు. వేసవి వచ్చిందంటే గిరిజన గూడేల్లో మహిళలు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి కష్టపడేవారని పేర్కొన్నారు. దీన్ని గమనించిన సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందిస్తున్నారని తెలిపారు. అలాగే చిన్న చిన్న గ్రామాలను పంచాయతీలుగా మార్చి, పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధిబాట పట్టించారన్నారు. ఎంపీ సోయం బాపురావ్ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలకు నిధులు ఖర్చు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ నాయకులు గిరిజనులపై కపట ప్రేమ చూపుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, ఆత్మ చైర్మన్ జిట్టా రమేశ్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ పరమేశ్వర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కొడప సోనేరావ్, నాయకులు సెవ్వ జగదీశ్, ఆదిలాబాద్ జడ్పీటీసీ అభ్యర్థి ఆరె నరేశ్ కుమార్, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.
రూ.10వేల ఆర్థిక సాయం..
హత్తిగూడలో కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న టేకం ధర్మును ఎమ్మెల్యే పరామర్శించారు. అనారోగ్య కారణాలను తెలుసుకొని రూ.10వేల ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మాట్లాడారు. వెంటనే రిమ్స్ దవాఖానకు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడికి వచ్చి తనకు సమాచారం ఇస్తే మెరుగైన వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు.