సింగరేణి ప్రాంత అభివృద్ధిపై యాజమాన్యం శ్రద్ధ
శ్రీరాంపూర్ ఏరియాల్లో రూ.2.5 కోట్లతో రోడ్ల నిర్మాణం
రూ.2 కోట్లతో క్వార్టర్లకు మరమ్మతులు
హర్షం వ్యక్తం చేస్తున్న కుటుంబాలు
శ్రీరాంపూర్, ఏప్రిల్ 16 :సింగరేణి ప్రాంత అభివృద్ధిపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. అందులో భాగంగా శ్రీరాంపూర్ ఏరియా కాలనీల్లో రూ.2.5 కోట్లతో బీటీ రోడ్లు నిర్మిస్తున్నది.20 కిలోమీటర్ల మేర తారు రోడ్లు వేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 16 కిలోమీటర్లు పూర్తి చేసింది. మరోవైపు రూ.2 కోట్లతో క్వార్టర్లకు మరమ్మతులు సైతం చేయిస్తున్నది. ప్రస్తుతం ఆయా ప్రాంతాలు కోత్త శోభను సంతరించుకుంటుండగా, కార్మిక కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మిక కాలనీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. 15 ఏండ్ల తర్వాత కార్మికుల కాలనీల్లోని రోడ్లను తిరిగి పునఃనిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. ఇందులో భాగంగా కార్మికులకు అన్ని విధాలా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎంత ఖర్చుకైనా సింగరేణి యాజమాన్యం వెనుకాడడం లేదు. గనులపైనా పెద్ద ఎత్తున కార్మికుల సంక్షేమానికి ఇప్పటికే క్యాంటీన్ల ఆధునీకరణ, రెస్టాల్స్, సులభ్ టాయిలెట్లు, సమావేశ హాళ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించింది. శ్రీరాంపూర్ ఏరియాలోని నస్పూర్, సీసీసీ, కృష్ణాకాలనీ, ఆర్కే 6 కాలనీ, ఆర్కే 8 కాలనీ, శ్రీరాంపూర్ కాలనీల్లో సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమంలో భాగంగా పెద్ద ఎత్తున తారురోడ్లు నిర్మిస్తున్నారు. నస్పూర్, శ్రీరాంపూర్ ఏరియాలోని ఆరు కాలనీల్లో ఏన్నో ఏండ్లుగా శిథిలమైన రోడ్లను యాజమాన్యం మళ్లీ నిర్మిస్తున్నది. ఇందుకోసం రూ.2.5 కోట్లతో శాశ్వత తారురోడ్లు వేస్తున్నది. నస్పూర్, సీసీసీ, శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మికుల కాలనీల్లో 20 కిలోమీటర్ల మేర తారురోడ్లు నిర్మించింది. ఆర్కే 6కాలనీ, కృష్ణాకాలనీల్లో 3.12 కిలోమీటర్లు, నస్పూర్ కాలనీలో 3.8 కిలో మీటర్లు, సీసీసీ టౌన్షిప్ ఏరియాలో 0.5 కిలో మీటర్ల పొడవున తారు రోడ్లు నిర్మించారు. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 8కాలనీ, శ్రీరాంపూర్లోని కార్మికుల కాలనీల్లో 6.5 కిలో మీటర్ల మేర తారురోడ్లు వేశారు. 20 కిలో మీటర్ల మేర వేయాలని లక్ష్యం కాగా.. ఇప్పటికే 16 కిలో మీటర్ల మేర రోడ్లు పూర్తయ్యాయి. మే 15 కల్లా అన్ని కాలనీల్లో తారురోడ్లు నిర్మించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి క్వార్టర్లు 6850 ఉన్నాయి. ఇందులో నస్పూర్కాలనీలో 4350, శ్రీరాంపూర్ కాలనీలో
540, ఆర్కే 6కాలనీ, కృష్ణాకాలనీలో 1332,ఆర్కే 8 కాలనీలో 366 క్వార్టర్లున్నాయి. దీంతో కార్మికుల కాలనీలు రోడ్ల నిర్మాణంతో కొత్త శోభను సంతరించుకున్నాయి. తారురోడ్ల నిర్మాణంపై కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రూ.2 కోట్లతో క్వార్టర్లకు మరమ్మతులు..
శ్రీరాంపూర్, నస్పూర్ ఏరియాలోని కార్మికుల క్వార్టర్ల మరమ్మతులు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.2 కోట్లు ఖర్చుచేశారు. క్వార్టర్ల పైకప్పు రిపేర్, టార్పాలిన్, మురుగు కాలువలు, క్వార్టర్ల లీకేజీలు లేకుండా అన్ని విధాలా పనులు చేపట్టారు. శానిటరీ పనులు చేపడుతున్నారు. శ్రీరాంపూర్ ఏరియా 8 గనులు, డిపార్ట్మెంట్లు, ఓసీపీలపై నూతనంగా రూ.1.5 కోట్లతో తొమ్మిది కిలోమీటర్ల మేర తారురోడ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. గనులపై కార్మికులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారు.