ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ టౌన్, జూలై 29 : కొవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది. ఆర్థిక మూలాలను దెబ్బ తీస్తున్నది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం నిరాటంకంగా పథకాలను కొనసాగిస్తూ పేదల పక్షపాతి అని నిరూపించుకుంటున్నది. ఇందులో భాగంగా ‘కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్’ పథకాల ద్వారా ఆడబిడ్డల పెళ్లికి అండగా నిలుస్తున్నది. ఏకంగా రూ.లక్షా నూట పదహార్లు చదివిస్తూ తల్లిదండ్రుల్లో ధైర్యం నింపుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర సర్కారు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ అనే ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. మొదట రూ.51 వేలు అందించింది. ఆ తర్వాత 2017 మార్చి 13 నుంచి రూ.75,116కు పెంచింది. 2018 మార్చి 19 నుంచి రూ.1,00,116కు పెంచి ఇస్తున్నది. దరఖాస్తు చేసుకుంటే చాలు.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తున్నది. ఆడపిల్లల పెండ్లిళ్లు చేయలేక సతమతమవుతున్న పేద కుటుంబాలకు ఇది కొండంత భరోసా ఇస్తున్నది.
12 నెలలు.. రూ.200.16 కోట్లు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఉండగా.. వీటి పరిధిలో ఎనిమిది రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను(2020 ఏప్రిల్ 1-మార్చి 31, 2021 వరకు) 12 నెలల్లో 17,464 కల్యాణలక్ష్మి, 2,743 షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఒక్కో ఆడబిడ్డ పెండ్లికి రూ.1,00,116 విలువైన చెక్కులను అందజేశారు. మంచిర్యాల రెవెన్యూ డివిజన్లో 3,170 మందికి కల్యాణ లక్ష్మి, 212 మందికి షాదీ ముబారక్.. బెల్లంపల్లిలో 1,343 మందికి కల్యాణ లక్ష్మి, 56 మందికి షాదీ ముబారక్.. ఆసిఫాబాద్లో1,581 మందికి కల్యాణ లక్ష్మి, 337 మందికి షాదీ ముబారక్.. కాగజ్నగర్లో 1,732 మందికి కల్యాణ లక్ష్మి,164 మందికి షాదీ ముబారక్.. నిర్మల్లో 3,221 మందికి కల్యాణలక్ష్మి, 632 మందికి షాదీముబారక్.. భైంసా 2,493 మందికి కల్యాణ లక్ష్మి, 550 మందికి షాదీ ముబారక్.. ఆదిలాబాద్లో కల్యాణలక్ష్మి 2,635 మందికి, షాదీముబారక్ 714 మందికి.. ఉట్నూర్లో కల్యాణ లక్ష్మి 1,289 మందికి, షాదీ ముబారక్ 78 మందికి చెక్కులు అందించారు.
ఒకేసారి రెండు చెక్కులు వచ్చాయి..
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆడబిడ్డలు ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తున్నడు. మాకు ముగ్గురు కూతుళ్లు. 2020 సంవత్సరంలో రెండో కూతురు వనిత, మూడో కూతురు నిఖిత పెండ్లి పక్షం రోజుల వ్యవధిలోనే చేశాం. వెంటనే ఆన్లైన్లో కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేశాం. ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున ఇద్దరికి రూ.2,00,232 డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులు మాకు ఎంతో ఆసరయ్యాయి. ముఖ్యమంత్రి పెద్ద మనస్సుతో మాలాంటి వారి ఇంట్లో పెండ్లికి డబ్బులు ఇవ్వడం సంతోషంగా ఉంది.
నా బిడ్డ లక్ష్మికి కల్యాణ లక్ష్మి వచ్చింది..
కల్యాణ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన రూ.1,00,116లతో నేను ధైర్యంగా నా బిడ్డ లక్ష్మి పెళ్లి చేశా. నా భర్త సుధాకర్ చాలా ఏండ్ల క్రితమే చనిపోయాడు. అప్పటికే నాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. పిల్లలను పెంచి పెద్ద చేయడానికే నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇల్లు గడవడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో కూతురు పెళ్లి చేయడం కష్టంగా మారింది. డబ్బుల పరంగా చాలా ఇబ్బందులు అవుతాయేమోనని అనుకున్నా. కానీ.. ప్రభుత్వం కల్యాణ లక్ష్మి ద్వారా అందించిన ఆర్థిక సాయంతో నా బిడ్డ పెండ్లి చేశా.
సాయం మర్చిపోలేం..
మాది సోన్ మండలంలోని బొప్పారం. గ్రామంలో చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాం. మా ఆయన హోటల్ నడిపితే నేను బీడీలు చుట్టి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్నాం. మాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒక కుమారుడు. మొన్ననే పెద్ద బిడ్డ రచనకు పెండ్లి చేశాం. కల్యాణలక్ష్మి కింద దరఖాస్తు చేసుకుంటే రూ.1,00,116లు వచ్చాయి. పెండ్లి కోసం కొంత అప్పులు చేయగా.. వడ్డీతో సహా చెల్లించాం. ఇప్పుడు అప్పులు లేకపోవడంతో.. పని చేయగా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం.
అప్పులు కట్టాం..
మాది కుంటాల మండలంలోని ఓలా గ్రామం. మేము హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాం. మాకు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి అర్చన, చిన్నమ్మాయి హారిక. పెద్దమ్మాయికి 2018లో పెండ్లి జరగ్గా.. చిన్నమ్మాయికి 2020లో పెండ్లి చేసినం. ఇద్దరికీ కల్యాణలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేశాం. పెద్దమ్మాయికి రూ.51వేలు, చిన్నమ్మాయికి రూ.1,00,116 చెక్కులను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం మా కుటుంబానికి రూ.1,51,116 లు వచ్చాయి. రూ.లక్ష వరకు బాకీ కట్టినం. మిగతా రూ.50 వేలు ఇంటి అవసరాల కోసం ఉంచుకున్నా. రూ.50 వేలు పాపకు బిడ్డ పుట్టడంతో దవాఖానలో ఖర్చుల కోసం ఉపయోగించుకున్నాం. – నాలం గజ్జారాం-లక్ష్మి, ఓలా, కుంటాల మండలం.
మా ఇద్దరు బిడ్డల పెళ్లిళ్లు కల్యాణ లక్ష్మితోనే చేశా..
ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం మా కుటుంబాన్ని ఆదుకుంది. నా భర్త రాంబాబు నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. నాకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు. నా భర్త చనిపోవడంతో పిల్లలను పెంచడమే నాకు కష్టంగా మారింది. ఎవుసం, కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. పెండ్లీడు కొచ్చిన కూతుళ్లు ఉండడంతో ఎలా పెండ్లి చేయాలని ఆలోచిస్తున్నా. నా పెద్ద బిడ్డ సౌమ్య పెళ్లికి రూ.75 వేలు, నా రెండో బిడ్డ రమ్య పెళ్లికి రూ.1,00,116 ప్రభుత్వం ఇచ్చింది. కల్యాణ లక్ష్మి ద్వారా అందించిన ఆర్థిక సాయంతోనే పెండ్లి చేశా. నా అసొంటి పేదవారికి సర్కారు డబ్బులు చాలా ఉపయోగపడుతున్నాయి.
షాదీకి పైసలిచ్చిండు
నాపేరు ఎండీ నభీ బేగం. నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఉన్నరు. పెద్ద కొడుకుకు అప్పు చేసి పెళ్లి చేసిన. మళ్ల బిడ్డ పెళ్లికెదిగింది. ఎట్ల చేయాలని గుబులు వడ్డ. కాని షాదీ ముబారక్ స్కీం కింద కేసీఆర్ సారు నా బేటీ షాదీకి పైసలు ఇచ్చిండ్రు. ఇప్పుడు నా బిడ్డను జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపుల పురానికి ఇచ్చిన. అప్పు లేకుండా పెళ్లి చేసిన. మస్తు ఖుషీగా ఉన్నది. పెద్ద కొడుకు లెక్క ఆదుకున్న కేసీఆర్కు షుక్రియ (ధన్యవాదాలు).
సీఎం సారూ సల్లంగుండాలే..
చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించాం. మాకు ఒక బాబు, ఒక పాప. ఇటీవల పాప సాయిశ్రీకి పెండ్లి చేశాం. కల్యాణలక్ష్మి కింద దరఖాస్తు చేసుకుంటే సర్కారు రూ.1,00,116 చెక్కు వచ్చింది. పెండ్లి సమయంలో అవసరాల కోసం డబ్బులు అడిగితే వెనుక ముందు ఆలోచించే ఈ రోజుల్లో ముఖ్యమంత్రి పెద్ద మనస్సుతో డబ్బులు ఇవ్వడం సంతోషంగా ఉంది.
సీఎం సాయం మరువం
మా అసొంటి పేదింటోళ్లు బిడ్డల పెండ్లిళ్లు చేసేందుకు ఇబ్బంది పడద్దని సీఎం సారు గొప్ప నిర్ణయం తీసుకున్నరు. పెళ్లీడుకచ్చిన ఆడపిల్ల ఉంటే మస్తు రందయ్యేది. పెండ్లికోసం అప్పులు చేయాల్సి వచ్చేది. గిప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంటోళ్లు మాలాంటోళ్లకు అండగా ఉంటన్రు. ఏడాది కింద కరోనా కాలంలనే నా కూతురు రమాదేవి పెండ్లి చేసిన. అన్ని జాగ్రత్తలు తీసుకున్నం. తక్కువమందినే పిలిచినం. కల్యాణ లక్ష్మి ద్వారా రూ.1,00,116 ఆర్థిక సాయం చేసిన్రు. పైసలకు తిప్పలు లేకుండా చేసిన కేసీఆర్ సారు సాయం జీవితంల మరువం.
అప్పులు లేకుండా లగ్గం చేసినం..
నా పేరు కొట్టె అనసూర్య. మాది నిరుపేద కుటుంబం. నా బిడ్డ భాగ్యలక్ష్మికి ఈ మధ్య పెండ్లి చేసిన. కల్యాణ లక్ష్మి కింద రూ. లక్షా నూట పదహార్లు సర్కారోళ్లు ఇస్తరంటె దరఖాస్తు చేసుకున్న. తొందరగనే నా ఖాతల రూ. లక్షా నూటపదహార్లు జమ చేసిన్రు. నా బిడ్డ పెండ్లికి మేనమామ లెక్క సాయం చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం. అప్పులు చేయకుండా లగ్గం చేసినందుకు సంతోషంగా ఉన్నది. మాలాంటోళ్లను ఆదుకుంటున్న గీ సర్కారు ఎప్పటికీ ఉండాలే.
కల్యాణ లక్ష్మి పథకం మమ్ములను ఆదుకుంది..
నా భర్త తులసీరాంతో కలిసి కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నం. మాకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు. కూలీకి పోతేనే మా కుటుంబం గడుస్తుంది. ఆడబిడ్డ పెండ్లి ఎలా చేయాలని బాధపడ్డం. మా పక్కింటోళ్లు కల్యాణ లక్ష్మి కింద లక్ష రూపాలు వస్తయని చెప్పిన్రు. ధైర్య మచ్చింది. ఈ డబ్బులపై ఆధారపడే మా కూతురు పెండ్లి జేసిన. దరఖాస్తు చేసుకుంటే రూ.1,00,116 వచ్చాయి.