వ్యాపార సంస్థలు మూసివేత
తగ్గుతున్న పాజిటివ్ కేసులు
ఇళ్ల వద్దే ఉంటున్న ప్రజలు
బోథ్, ఏప్రిల్ 29: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు నియోజకవర్గ పరిధిలోని బోథ్, భీంపూర్, నేరడిగొండ, ఇచ్చోడ మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కేసులు పెరగడంతో పాలవర్గాలు, ప్రజాప్రతినిధులు బంద్ పాటించాలని తీర్మానాలు చేసి ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. 15 రోజులుగా లాక్డౌన్ పాటిస్తుండడంతో గతంలో కంటే పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
బోథ్లో..
మండల కేంద్రంతో పాటు సొనాలలో వారసంత రద్దు చేశారు. బోథ్లో 10 రోజుల పాటు మూడు గంటలు మినహా రోజంతా వ్యాపార సంస్థలు మూసివేశారు. ఐదు రోజులుగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి లాక్డౌన్ పాటిస్తున్నారు. సొనాలలో మధ్యాహ్నం నుంచి వ్యాపారులు దుకాణాలు మూసి వేస్తున్నారు. గతంలో ప్రతి రోజూ 50కి పైగా పాజిటివ్ కేసులు రాగా ప్రస్తుతం 30లోపు వస్తున్నాయి.
ఇచ్చోడలో..
సిరిచెల్మలో మూడు రోజుల పాటు పూర్తి లాక్డౌన్ పాటించారు. ఇచ్చోడలో మధ్యాహ్నం 12 నుంచి ప్రతి రోజూ లాక్డౌన్ పాటించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు తీర్మానం చేసి అమలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చింది.
భీంపూర్లో..
భీంపూర్: కరంజి(టీ), పిప్పల్కోటి, భీంపూర్లో లాక్డౌన్ అమలు చేశారు. కామాటివాడలో వచ్చే నెల ఒకటి నుంచి లాక్డౌన్ పాటించాలని పంచాయతీ పాలక వర్గ సభ్యులు తీర్మానం చేశారు.
నేరడిగొండలో…
నేరడిగొండ: మండల కేంద్రంలో ప్రతి రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు మూసివేస్తున్నారు. మిగిలిన సమయాల్లో సరుకుల కొనుగోలుకు అనుమతి ఇస్తున్నారు.
లాక్డౌన్తో మంచి ఫలితాలు
స్వచ్ఛంద లాక్డౌన్తో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావడం లేదు. గ్రామాల్లో అమలవుతున్న నియమాలతో కేసులు అదుపులోకి వస్తున్నాయి. ప్రయాణాలు తగ్గిపోవడంతో సామూహిక వ్యాప్తి అరికట్టే వీలు కలుగుతున్నది.
కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నాం
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సరుకులు అమ్ముతున్నాం. 15 రోజులుగా దుకాణాలు మూసి వేయడంతో ఆర్థికంగా నష్టం కలుగుతున్నా ప్రజల ప్రాణాలు ముఖ్యమని సహకరిస్తున్నాం. మరి కొద్ది రోజులు పాక్షిక లాక్డౌన్ పాటిస్తే కరోనా కేసులు తగ్గుముఖం పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
-ఆర్ సంతోష్కుమార్, వ్యాపారి, బోథ్