ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో 50 పడకలకు ఆక్సిజన్ అందించేందుకు ప్రభుత్వం రూ 42 లక్షల నిధులతో మంజూరు చేసిన సుమిత్ సంస్థ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ట్రయల్ రన్ను గురువారం జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ప్రభుత్వ దవాఖానకు ఈ ప్లాంటు ద్వారా ఆక్సిజన్ కొరత తీరనుందని , ఒక్క నిమిషానికి 250 ఎల్. పీ. ఎం. ఆక్సిజన్ సరఫరా జరుగుతుందని వివరించారు. 95 శాతం శుద్ధతతో కలిగిన ఆక్సిజన్ రోగులకు అందుతుందని పేర్కొన్నారు.
సివిల్ , ఎలక్ట్రికల్ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మాణమవుతున్న ఈ.వీ.ఎం గోదాములను పరిశీలించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించి ప్రజల సౌకర్యార్థం అన్ని సేవలు ఒకే చోట లభించే విధంగా 53 కోట్ల రూపాయలతో 20ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనాన్ని త్వరగా పూర్తి చేసి వినియోగంలో తీసుకురావాలని రోడ్లు , భవనాల శాఖ ఈ.ఈ పెద్దయ్యను ఆదేశించారు.