చెత్తకుప్పలు, రైల్వే, బస్స్టేషన్లు, మురుగు కాలువల వద్ద వదిలివేత
ఏటా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఘటనలు
శిశుగృహలో పెరుగుతున్న అనాథ పిల్లలు
దత్తత తీసుకోవడంలోనూ బాలికలపై వివక్షే
ఎదులాపురం, మే 1 : “పక్షం రోజుల క్రితం నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామ పరిధిలో నవజాత ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు గోనె సంచిలో పెట్టి ముళ్లపొదల్లో పడేసి వెళ్లారు. నిన్న(శనివారం) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేటలో ఆడ శిశువును మురుగు కాలువ పక్కన పడేశారు.” ఇలా ఆడబిడ్డ పుడితే చాలు బంధాలను తెంచుకుంటున్నారు. చెత్తకుప్పలు, రైల్వే, బస్స్టేషన్, మురుగు కాలువల పక్కన పడేస్తు న్నారు. ఆడబిడ్డలపై అంతులేని వివక్ష చూపుతున్నారు. ఆడపిల్ల అంటే మహాలక్ష్మీగా భావించే మనం.. ప్రస్తుతం కొందరు తల్లిదండ్రులు భారంగా భావిస్తున్నారు.. మానవత్వానికి మచ్చ తెస్తున్నారు. కాగా.. శిశుగృహ నుంచి దత్తత తీసుకునే వారు కూడా ఆడబిడ్డలను తీసుకునేందుకు ముందుకురావడం లేదు.
ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మలు ఎంతో సంబురపడిపోయేవారు. మహాలక్ష్మిగా, చిట్టితల్లిగా అనేక పేర్లతో పిలుస్తూ ప్రేమ చూపేవారు. కానీ ప్రస్తుతం ఆడపిల్ల పుట్టిందంటే చాలు భారంగా భావించే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. ఆడపిల్లను కన్నదని భార్యను వేధించడం, విడాకులు ఇవ్వడం కూడా సర్వసాధారణమైపోయింది. ఒకవేళ కన్నతల్లి కాదన్నా.. కొందరు తండ్రులు మాత్రం వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల తండ్రి ఎవరో తెలియని పరిస్థితుల్లో మోసపోయిన యువతులు పుట్టిన పసిగుడ్డును వదిలేసి వెళ్తున్నారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఐసీపీఎస్, 1098,100, పోలీసుల సహకారంతో ప్లిలలను శిశుగృహంలో చేరుస్తున్నారు. అనాథలైన బాలికలను దత్తత తీసుకోవడంలోనూ కొందరు వివక్ష కనబరుస్తున్నారు. మగ పిల్లలే కావాలంటూ ఆసక్తి చూపుతున్నారు. పక్షం రోజుల క్రితం నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామ పరిధిలో నవజాత ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు గోనె సంచిలో పెట్టి ముళ్లపొదల్లో పడేసి వెళ్లారు. శనివారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని రాజంపేట గ్రామంలో ఓ శిశువును మురుగు కాలువ పక్కన పడేశారు.
ఆడపిల్ల అంటే అలుసా..
కొందరు తల్లిదండ్రులు ఆడపిల్లలను కని..పెంచి పోషించడం ఆర్థికంగా భారమని భావిస్తున్నారు. ఇక కొందరు కామాంధుల చేతిలో బలైన యువతులకు పుట్టిన పిల్లలను ఏం చేయాలో తెలియక చెత్తకుప్పలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో వదిలేస్తున్నారు. మరికొందరు స్వచ్ఛందంగా శిశుగృహకు ఆడశిశువులను అప్పగించి మళ్లీ కొత్త జీవితాలను ప్రారంభిస్తున్నారు. అలా వదలించుకుంటున్న పిల్లలను స్థానికులు గమనించి పోలీసులు, ఐసీపీఎస్ సిబ్బందికి సమాచారం ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అలా వదిలేసిన పసికందులను కుక్కలు, పందులు పీక్కు తిన్న ఘటనలు కూడా ఉన్నాయి. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలు, బాలికల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. భేటీ పడావో.. భేటీ బచావో.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, బాలికల కోసం ప్రత్యేక హాస్టళ్లు, పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. ఆడపిల్ల భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు ప్రారంభించినా.. అవగాహన లోపంతో ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారు.
దత్తత తీసుకోవడంలోనూ వివక్షే..
ఇక కొందరు పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకునేందుకు శిశుగృహలకు వస్తున్నారు. అయితే వారు మగపిల్లలే కావాలని పట్టుబడుతున్నారు. శిశుగృహాల్లో బాలుర సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ఇతర రాష్ర్టాల్లో కూడా బాలురు ఉన్నారేమోనని సమాచారం తెలుసుకోవడానికి సైతం వెళ్తున్నారు. బాలురు ఎక్కడ ఉన్నా తెలుసుకొని మరీ తీసుకెళ్తున్నారు. ఇలా చేయడంతో శిశు గృహలో బాలికల సంఖ్య పెరుగుతూ ఉండగా, బాలుర సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత ప ది నెలలకాలంలో నలుగురు దత్తతకు పోగా, అందులో ముగ్గురు మగపిల్లలు ఉండడం, ఒక్కరే బాలిక ఉండడం గమనార్హం. ఆడపిల్లల ఆల నా పాలనా చూడడం ఆర్థికంగా భారమని భావించి కొందరు తమ పిల్లలను ఎవరికీ తెలియకుండా అమ్ముకున్న ఘటనలు కూడా జిల్లా లో ఉన్నాయి. ఆడపిల్ల అయితే రూ.50 వేల నుంచి రూ.లక్ష, మగ పిల్లవాడైతే రూ.లక్ష నుంచి రూ.2.50 లక్షల వరకు అమ్ముకుంటున్నారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల ఉమ్మడి జిల్లాలో పిల్లలను వదిలేసిన ప్రాంతాలు..
ఉట్నూర్ మార్కెట్లో ఆర్ఎంపీ వద్ద గోనె సంచిలో ఉంచి ఎనిమిది నెలల ఆడ శిశువును వదిలివెళ్లారు.
ఆదిలాబాద్ రైల్వేస్టేషన్లో నాలుగేండ్ల మూగ అమ్మాయిని వదిలించుకున్నారు.
రిమ్స్ దవాఖానలో వేళ్లు సరిగ్గా లేవని మూడు నెలల బాలుడిని వదిలేశారు.
తాంసి మండలంలో ఓ బ్రిడ్జి వద్ద మూడు నెలల ఆడ శిశువును వదిలేశారు.
ఇటీవల ఆరోగ్యంగా ఉన్న నాలుగు నెలల ఆడ శిశువును రిమ్స్ దవాఖానలోని పిల్లల వార్డులో వదిలేశారు.
నార్నూర్ మండలంలో 14 ఏళ్ల బాలిక లైంగికదాడికి గురికావడంతో ఆమె గర్భం దాల్చింది. దీంతో పుట్టిన ఆడబిడ్డను స్వయంగా శిశుగృహలో అప్పగించి, నూతన జీవితాన్ని ప్రారంభించింది.
జైనథ్ మండలంలో మరో బాలిక గర్భం దాల్చడంతో ఆమె కూడా అదే విధంగా శిశు గృహంలో ఆడ శిశువును వదిలివెళ్లింది.
మంచిర్యాలలో తల్లీబిడ్డా భిక్షాటన చేస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి మరణించింది. బిడ్డ అనాథగా మారడంతో శిశుగృహలో చేర్పించారు.
గత నెలలో తాంసి మండలంలో బాబును ఊయలలో వదిలేశారు.
ఆదివారం నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామంలో కూడా నవజాత శిశువును గోనె సంచిలో పడేశారు.
పిల్లలు వద్దనుకుంటే శిశుగృహను సంప్రదించాలి
పిల్లలు వద్దనుకునే వారు అక్కడి, ఇక్కడ,రోడ్లు, ముళ్లపొదల్లో పడేయడంకంటే శిశుగృహకు అప్పగించాలి. పిల్లలను అప్పగించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నవారికి పిల్లలను దత్తత ఇవ్వడం జరుగుతుంది. శిశుగృహలో నవజాత శిశువులను 24 గంటలపాటు కంటికిరెప్పలా, సొంత బిడ్డల్లా చూసుకుంటున్నాం. నిర్మల్ జిల్లాలో నవజాత ఆడశిశువును గోనెసంచిలో పడేయడం బాధాకరం.