సీసీసీ నస్పూర్, ఆగస్టు 2 : కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సమష్టి కృషితో శ్రీరాంపూర్ ఏరియాలో వంద శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం సురేశ్ పేర్కొన్నారు. సీసీసీ నస్పూర్ సింగరేణి గెస్ట్హౌస్లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్పత్తి వివరాలు వెల్లడించారు. జూలై నెలలో శ్రీరాంపూర్ గనుల్లో 102శాతం ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. ఐకే-1ఏ గనిలో 118 శాతం, ఆర్కే-5గనిలో 104 శాతం, ఆర్కే-6 గనిలో 112శాతం, ఆర్కే-న్యూటెక్ గనిలో 108 శాతం, ఎస్ఆర్పీ-1లో 109 శాతం, ఎస్ఆర్పీ-3లో 102 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు వివరించారు. శ్రీరాంపూర్ ఓసీపీలో 84 శాతం, ఐకే ఓసీపీలో 146 శాతం సాధించినట్లు చెప్పారు. అధిక వర్షాలతో శ్రీరాంపూర్ ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి తగ్గిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం జూలై వరకు 86 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. గతేడాదితో పోల్చితే ఈ ఆర్థిక సంవత్సరం అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు చెప్పారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఇంతటి ఉత్పత్తి సాధించేందుకు కృషిచేసిన ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. ఇందుకు సహకరించిన యూనియన్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే స్ఫూర్తితో సంస్థ నిర్దేశిత లక్ష్యం 65 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలని కోరారు. కరోనా నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా 7వ విడుతలో 4.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొని, ఇప్పటి వరకు 2.50 లక్షలు నాటినట్లు చెప్పారు. ఇందారం ఓపెన్కాస్టు వద్ద గల బండ్ సుందరీకరణ చేపడుతున్నామని తెలిపారు. 3 కిలోమీటర్ల మేర 20 వేల మొక్కలు నాటేందుకు మెగా హరితహారం చేపడుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సంస్థ సీఎండీ శ్రీధర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచడంతో శ్రీరాంపూర్లో రిటైర్డ్ అయిన 231మందిని మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్వోటూజీఎం గుప్తా, డీజీఎం పర్సనల్ అరవింద్రావు, ఐఈడీ డీజీఎం చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి ఏరియాలో 89 శాతం..
మందమర్రి రూరల్, ఆగస్టు 2 : మందమర్రి ఏరియాలో జూలై నెలకు సంబంధించి 89 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. స్థానిక జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన మాట్లాడారు. కేకే 1 గనికి 15,500 టన్నులు నిర్దేశించగా, 17,301 టన్నులు (112 శాతం) సాధించి ముందంజలో నిలిచిందన్నారు. కేకే 5 (75 శాతం), ఆర్కే 1ఏ (76 శాతం), కాసిపేట (56 శాతం), కాసిపేట- 2 (44 శాతం), శాంతిఖని (80 శాతం), ఆర్కే ఓసీ (107 శాతం), కేకే ఓసీ (83 శాతం) బొగ్గు ఉత్పత్తి సాధించాయని పేర్కొన్నారు. కేకే 1 గని అధికారులు, కార్మికులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం జగన్మోహన్రావు, పీఎం వరప్రసాద్, ఐఈడీ రాజన్న, డీవై పీఎం శ్యామ్ సుందర్, సీనియర్ పీవో మైత్రేయ బంధు పాల్గొన్నారు.