జైనథ్, జూలై 31 : రైతులు పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటించాలని ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ పేర్కొన్నారు. మండలంంలోని కూరలో సోయాబీన్ పంటలో శనివారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏవో వివేక్ మాట్లాడుతూ.. సోయాబీన్లో కాండపు ఈగ (స్టేమ్ైప్లె), పెంకు పురుగు/కాండపు పురుగు ఆశిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సోయాచిక్కుడులో కాయలు ఏర్పడు లేదా గింజకట్టు దశలో భూమిలో సరైన తేమ ఉన్నప్పుడు ఎకరాకు 25-30 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ కలిపి మొక్కల దగ్గరగా వేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లతావెంకట్రెడ్డి, ఏఈవోలు సాయికృష్ణ, శ్రీకాంత్, రైతులు పాల్గొన్నారు.
పత్తిలో గులాబీ పురుగు నివారణ చర్యలు..
పత్తి పంటలో ప్రస్తుత దశలో అసలు గులాబీ పురుగు ఆశించకుండా ఎకరాకు 6- 8 వరకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని ఏఈవో మహేశ్ సూచించారు. శనివారం ఆయన చింతపల్లి, గుబ్డిపల్లి గ్రామాల శివార్లలో పత్తి చేలలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రైతులకు పలు సూచనలు చేశారు. 200 లీటర్ల నీటి డ్రమ్ములో 400 మిల్లీ లీటర్ల క్రోమినోఫాస్ ద్రావణం కలిపి మొక్కలకు పిచికారీ చేయాలని వివరించారు. అంతర్గాంలో ఏఈవో సాయి, కరంజి(టి)లో ఏఈవో వికాల్, అందర్బంద్లో ఏఈవో శంకర్ అవగాహన కల్పించారు. సర్పంచ్లు ఎన్.లక్ష్మి, జీ స్వాతిక, బక్కి లలిత, పెండెపు కృష్ణయాదవ్, రైతులు ఉన్నారు.
సోయాలో కాండం తొలుచు పురుగు నివారణ..
సోయాబీన్లో కాండం తొలుచు పురుగు, కాండం ఈగ నివారణ చర్యలు చేపట్టాలని బోథ్ మండల వ్యవసాయ అధికారి వెండి విశ్వామిత్ర సూచించారు. బోథ్లోని సోయా, పత్తి పొలాలను రైతులతో కలిసి శనివారం సందర్శించారు. సోయాలో వీటి నివారణకు 4 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జీ గుళికలను 10 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలన్నారు. ఆయన వెంట ఏఈవోలు కృష్ణ, సంతోష్, రైతులు పోతన్న, మాధవ్ పాటిల్ ఉన్నారు.