బోథ్, ఆగస్టు 2: మండలంలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. రోడ్ల వెంట నాటిన మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేయిస్తున్నారు. మొక్కలు వంగిపోకుండా ఉండేందుకు ఆసరాగా ఊత కర్రలు పాతిస్తున్నారు. బోథ్ మండలంలోని 33 పంచాయతీల్లో హరితహారం కింద 2.27 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే లక్ష్యాన్ని అధిగమించారు. వీటిలో 62 వేల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేసి నాటించారు. 13,500ల మొక్కలు అవెన్యూ ప్లాంటేషన్ కింద (రోడ్ల వెంబడి) నాటారు. మిగిలిన వాటిని ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాలు, పొలం గట్లు తదితర ప్రాంతాల్లో నాటారు. నాటిన ప్రతి మొక్కకూ ట్రీగార్డులు ఏర్పాటు చేయిస్తున్నారు. ఇనుప, ప్లాస్టిక్ జాలీలను మొక్క చుట్టూ కంచెగా పెట్టిస్తున్నారు. ట్రీగార్డు పైభాగంలో హరిత హారంలో నాటినట్లుగా చూసే విధంగా గ్రీన్ మ్యాట్ అంచును కట్టిస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్ కింద నాటిన మొక్కల్లో 90 శాతానికిపైగా బతకాలనే ప్రభుత్వ ఆదేశాలతో వాటిరి సంరక్షించేందుకు అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీడీవో సీహెచ్ రాధ, ఎంపీపీ తుల శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీవో భీంరావు, టీఏలు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ పంచాయతీ అధికారులకు సూచనలిస్తున్నారు. వర్షాలు పడకపోతే మొక్కలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని సూచిస్తున్నారు.
సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం..
అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కనూ కాపాడేందుకు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ట్రీగార్డులు ఏర్పాటు చేయిస్తున్నాం. అవసరమైన సమయంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని సూచించాం. వీటితో పాటు హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఇంటింటికీ పంపిణీ చేసిన మొక్కలను బాధ్యతగా పెంచాలని సూచిస్తున్నాం.
సీహెచ్ రాధ, ఎంపీడీవో