మూడు చోట్ల ఆక్సిజన్ ఉత్పత్తి..రెండో చోట్ల తుది దశకు..
రూ.3.63 కోట్ల కేటాయింపు.. రోజుకూ 40 సిలిండర్ల ఉత్పత్తి..
సీఎం ఆదేశాల మేరకు చొరవ చూపిన సీఎండీ శ్రీధర్
టర్కీ దేశం నుంచి అధునాతన పరికరాలు దిగుమతి
మందమర్రి, ఆగస్టు 3 : సింగరేణి కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ సర్కారు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది. సెకండ్ వేవ్లో కార్మికులు, ఉద్యోగులు కరోనాతో అతలాకుతలం అయ్యారు. కార్మికుల రక్షణ కోసం సర్కారు ఆదేశాలతో యాజమాన్యం విశేష కృషి చేసింది. దాదాపు రూ.71 కోట్లతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియా దవాఖానల్లో వసతులు కల్పించింది. ఇందులో ర్యాపిడ్ టెస్టులు చేయడం, బెడ్స్ ఏర్పాటు, క్వారంటైన్లో ఉన్న వారికి ప్రత్యేక కిట్లు ఇవ్వడం, రెమ్డెసివిర్, ఫెవిపెరావిర్ వంటి మందులు సమకూర్చడం, ఆక్సిజన్ (ప్రాణవాయువు) సిలిండర్లను ఇవ్వడం, పౌష్టికాహారం అందజేయడం చేశారు. అత్యవసర కేసులను కార్పొరేట్ దవాఖానలకు తరలించి చికిత్స అందించారు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలతో యాజమాన్యం ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
విపత్కర పరిస్థితులను అధిగమించేందుకు..
కరోనా సెకండ్ వేవ్ సమయంలో రామకృష్ణాపూర్ దవాఖానకు రోజుకు సుమారు 30 నుంచి 35 ఆక్సిజన్ సిలిండర్ల అవసరం ఏర్ప డింది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వైద్యులు మహారాష్ట్రలోని చంద్రా పూర్, హైదరాబాద్ నుంచి సిలిండర్లను తెప్పించారు. అంతేకాకుండా విపత్కర పరిస్థితుల్లో మందమర్రి మండల పరిధిలోని కోటేశ్వర్రా వుపల్లిలో గల ప్రైవేట్ ఆక్సిజన్ ప్లాంట్ నుంచి కూడా తీసుకొచ్చి బాధితుల ప్రాణాలు కాపాడారు. ఆపత్కాలంలో ఇతర ప్రాంతాల నుంచి సిలిండర్లను తీసుకురావడం ఇబ్బందిగా మారడంతో సొంత ప్లాంట్ల నిర్మాణానికి సింగరేణి పూనుకున్నది. ఒక్కో ప్లాంట్కు రూ.35 లక్షలతోపాటు రెండేళ్ల మెయింటెనెన్స్కు నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసిన ప్లాంట్ ద్వారా సెంట్రలైజ్డ్ పైప్లైన్లతో అన్ని వార్డులకు సరఫరా చేస్తారు.
మూడు చోట్ల ఉత్పత్తి.. రెండు చోట్ల నిర్మాణ దశలో..
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండడానికి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు సింగరేణి డైరెక్టర్ల సమావేశంలో కోల్బెల్ట్ వ్యాప్తంగా ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొత్తగూడెం, భూపాలపల్లి, రామకృష్ణాపూర్, బెల్లంపల్లిలో ఏర్పాటు చేసే ఒక్కొక్క ప్లాంటు రోజుకూ 40 సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన ప్లాంటు 45 క్యూబిక్ మీటర్లు ఉత్పత్తి చేస్తాయి. మొత్తంగా రోజుకూ 250కిపైగా సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఇందుకోసం నాలుగు చోట్ల ఏర్పాటు చేసే ప్లాంట్లకు ఒక్కోదానికి రూ.35 లక్షల చొప్పున రూ.1.40 కోట్లు, గోదావరిఖనిలో నిర్మించే ప్లాంటుకు రూ.2.23 కోట్లు ఖర్చు చేస్తున్నారు. వీటిలో కొత్త గూడెంలోని మెయిన్ దవాఖానతోపాటు మందమర్రిలోని రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రి, బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రిలో ప్లాంట్ల నిర్మాణం పూర్త యి ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నాయి. భూపాలపల్లి, గోదావరిఖని ఏరియా దవాఖానల్లో ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. గోదావరిఖనిలో నిర్మించే ప్లాంట్ ద్వారా సిలిండర్లలో ఆక్సిజన్ను నింపి ఇతర దవాఖానలకు సరఫరా చేయవచ్చు. ప్లాంట్ల విడిభాగాలను టర్కీ దేశం నుంచి తీసుకొచ్చి నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేసేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నది.
ఉత్పత్తి ఇలా..
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన ప్లాంటులో ఆక్సిజన్ ఉత్పత్తి ప్రక్రియ ఇలా ఉంటుంది. ప్లాంట్లోని అత్యంత శక్తివంతమైన కంప్రెషర్ బయట నుంచి గాలిని తీసుకుంటుంది. ఈ గాలిని కంప్రెషర్ పక్కనే ఉన్న డయ్యర్లోకి పంపిస్తుంది. డయ్యర్ గాలిలోని తేమను వేరు చేస్తుంది. అనంతరం ఫిల్టర్లు ఒక మైక్రాన్ కన్న తక్కువ సైజు ఉన్న దుమ్మూధూళిని తొలగించి గాలిని శుభ్రపరుస్తాయి. ఇక్కడి నుంచి శుభ్రమైన గాలి కార్బన్ టవర్లో కార్బన్ పదార్థాలను వేరు చేస్తాయి. అనంతరం ఈ గాలిని జనరేటర్లోకి పంపిస్తారు. ఇక్కడ అమర్చిన మాలిక్యూలర్ స్లీవ్స్ గాలిలోని నైట్రోజన్ను వేరు చేస్తాయి. ఈ విధంగా తయారైన ఆక్సిజన్ను ప్రత్యేక టవర్(సిలిండర్)లో నిలువ చేస్తారు. అవసరం అయినపుడు పైప్లైన్ ద్వారా వార్డులకు సరఫరా చేస్తారు.
ఇక ఆక్సిజన్కు ఢోకా లేదు..
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడ్డాం. మహారాష్ట్ర, హైదరాబా ద్ల నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పిం చాం. మామూలు రోజుల్లో రోజుకు సుమా రు 4 సిలిండర్లు అవసరం కాగా.. విపత్కర పరిస్థితుల్లో 30 నుంచి 35 అవసరం పడ్డాయి. దవాఖాన ఆవరణలోనే ప్లాంట్ ఏర్పాటు చేయడంతో ఇబ్బంది తప్పనుంది.
ఒకేసారి 80 మందికి ఆక్సిజన్..
బెల్లంపల్లి టౌన్, ఆగస్టు 3 : కరోనా సెకండ్వేవ్ అందరినీ పరుగులు పెట్టించింది. చాలా మందికి ఆక్సిజన్ అవసరమైంది. ఎప్పటికప్పుడూ తెప్పించినా, ఎప్పుడు ఏ సిలిండర్ అయిపోతుందో తెలియని పరిస్థితి ఉండేది. ఇప్పుడు మాత్రం యాజమాన్యం మంచి నిర్ణయం తీసుకున్నది. ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ద్వారా ఒక్కసారి 80 మందికి ఊపిరినీయవచ్చు. ఇక్కడ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి రూ.36.05 లక్షలు ఖర్చు చేశారు. థర్డ్ వేవ్ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఇప్పుడే అప్రమత్తమై, వైద్య సిబ్బందిని అప్రమత్తం చేసింది.