చెన్నూర్ రూరల్, ఆగస్టు 2 : చెన్నూర్ పట్టణంలో బంగారం బిస్కెట్ల తయారీపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని జైపూర్ ఏసీపీ నరేందర్ అన్నారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడారు. పట్టణంలోని కొందరు స్వర్ణకారులు కల్తీ బంగారం బిస్కెట్లను తయారు చేస్తున్నారని స్వర్ణ కారుల జిల్లా సభ్యులు శ్రీకాంతాచారి, పూర్ణచంద్రచారి రామగుండం పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో సీపీ ఆదేశాల మేరకు కల్తీ బంగారంపై విచారణ చేపట్టాగా ఎలాంటి కల్తీ బంగారం, తయారు చేసిన బంగారం బిస్కెట్లు గానీ దొరకలేదని తెలిపారు. ఫిర్యాదుదారుల వద్ద కూడ బిస్కెట్ల తయారీపై సరైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో నకిలీ బంగారంపై ప్రజాప్రతినిధుల అండదండలు, పట్టించుకోని పోలీసులు అంటు పలువురు లేనిపోనివి కలిపి పోస్టు చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని కోరారు. ఇప్పటికైనా చెన్నూర్ స్వర్ణకారులు నకిలీ బంగారం అమ్మినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే స్వర్ణకారులను విచారించి వారిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు వినోద్, విక్టర్ పాల్గొన్నారు.
డబ్బుల డిమాండ్ చేశారు..
స్వర్ణకారుల జిల్లా కార్యదర్శి శ్రీకాంతాచారి, స్టేట్ సెక్రటరీ పూర్ణచారి ఇద్దరు కలిసి చెన్నూర్ స్వర్ణకార సంఘాన్ని రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆ సంఘం అధ్యక్షుడు సద్దనపు శంకరయ్య తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డబ్బులు ఇవ్వలేదని, కావాలనే వారు చెన్నూర్ స్వర్ణకారులపై కక్ష కట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. చెన్నూర్లో 50 ఏండ్ల నుంచి ప్రభుత్వం అనుమతి పొందిన నాణ్యతతో కూడిన బంగారాన్ని విక్రయిస్తున్నామని, ఆరోపణలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.