ఎదులాపురం : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని 1989 సంవత్సరం బ్యాచ్కు చెందిన 12 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతి కల్పిస్తూ జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఉద్యోగోన్నతి సాధించిన వారిని జిల్లా ఇన్చార్జి ఎస్పీ మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారి భుజస్కంధాలపై చిహ్నం అలంకరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉద్యోగోన్నతి పొందిన వారు విధి నిర్వహణలో మరింత బాధ్యతగా పని చేయాల్సి ఉంటుందని జిల్లా ఇన్చార్జి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. 1989 సంవత్సరంలో ఎంపికైన కానిస్టేబుళ్లు ఇప్పటివరకు రెండు పదోన్నతులు కల్పించామని తెలిపారు. త్వరలో 1990 బ్యాచ్ హెడ్ కానిస్టేబుళ్లకు ఎఎస్సైలుగా ఉద్యోగోన్నతి
కల్పించే ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
కేసులు నమోదు చేయడం, దర్యాప్తు చేపట్టడం, బందోబస్తులో ఇన్చార్జిలుగా వ్యవహరించడం, వాహనంలో పెట్రోలింగ్ , తదితర ప్రధానమైన వాటిలో జవాబుదారీగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్ 2 , కొమురం భీం ఆసిఫాబాద్ 4, మంచిర్యాల్ జిల్లా 6 ఏఎస్ఐ పోస్టులు ఖాళీలుగా ఉన్నాయని, ఉద్యోగోన్నతి పొందిన వారికి 12 మందిలో సీనియార్టీ ప్రకారం జిల్లాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పరిపాలనాధికారి మహ్మద్ యూనున్ అలీ, సెక్షన్ అధికారి జి.జగదీశ్, పోలీస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్, కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ, క్యాంప్ కార్యనిర్వాహణాధికారి దుర్గం శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ సీఐ జే. కృష్ణమూర్తి, ఎస్ఐ సయ్యద్ అన్వర్ ఉల్ హక్ తదితరులు పాల్గొన్నారు.