పూర్తయిన డంప్యార్డు, వైకుంఠధామం
కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణం
పల్లె ప్రకృతి వనంతో కొత్త శోభ
ప్రతి రోజూ పారిశుధ్య కార్యక్రమాలు
కోటపల్లి, ఏప్రిల్ 16 : కోటపల్లి మండలంలోని ఆలుగామ అద్దంలా మెరుస్తున్నది. పల్లె ప్రగతి ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ ఊరిలో 1648 జనాభా, 413 నివాస గృహాలు ఉన్నాయి. గ్రామ సర్పంచ్ సంతోష్ నేతృత్వంలో పాలన సమర్థవంతంగా సాగుతున్నది. గ్రామంలో రూ.12.5 లక్షలతో వైకుంఠధామం, రూ. 2.5లక్షలతో డంప్ యార్డు నిర్మించారు. పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి 4000 మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ప్రధాన రోడ్డుకు ఇరువైపులా 800 మొక్కలు నాటారు. ఊరిలో 156 విద్యుత్ స్తంభాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చగా, రాత్రిళ్లు గ్రామస్తులకు చీకటి కష్టాలు తెలిగిపోయాయి. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రతి రోజూ మొక్కలకు నీళ్లు పట్టేందుకు రూ. 6.2 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, నీటి ట్యాంకర్ను కొనుగోలు చేశారు. నలుగురు కార్మికులు ప్రతిరోజూ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సీడీపీ నిధులు రూ.9 లక్షలు, పంచాయతీ నిధులు రూ.10 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. గ్రామంలో 70 శాతానికి పైగా సీసీ రోడ్లు నిర్మించగా, త్వరలోనే మిగతా చోట్ల పనులు పూర్తి చేస్తామని సర్పంచ్ తెలిపారు. ప్రస్తుతం రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణం సాగుతుండగా, త్వరలో మరో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. యేటా 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు. 100 శాతం మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణం కూడా పూర్తయ్యింది.
సాఫ్ట్వేర్ జాబ్ను వదులుకొని..
కుమ్మరి సంతోష్ హైదరాబాద్లోని టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర్ జాబ్ను వదులుకొని సర్పంచ్గా పోటీ చేసి గెలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. పల్లెప్రగతి ద్వారా పంచాయతీని అభివృద్ధి చేసుకునే అవకాశం రాగా, పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఊరు మారిపోయింది
మా ఊరిలో పల్లె ప్రగతి ద్వారా అనేక పనులు చేశారు. వైకుంఠధామం, డంప్యార్డు నిర్మించారు. సీసీ రోడ్లు కూడా వేశారు. ప్రతి రోజూ ఇండ్లలోని చెత్తను ట్రాక్టర్లో తీసుకుపోతున్నరు. రోడ్లను కూడా శుభ్రంగా ఉంచుతున్నరు. ఒకప్పటిలాగా మా ఊరు లేదు. మస్తు మారిపోయింది. ఎంతో అభివృద్ధి చెందింది. ఇందుకు చాలా ఆనందంగా ఉంది.